తెలంగాణతో సహా ఆ రాష్ట్రాల్లో బీజేపీని తుడిచేస్తాం: అమెరికాలో రాహుల్ గాంధీ
న్యూయార్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమ పార్టీ త్వరలో ఎన్నిలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పరంపరను కొనసాగిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. న్యూయార్క్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్-యూఎస్ఏ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందన్నారు.
కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదని.. యావత్తు దేశం ధ్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు సిద్ధమైందని బీజేపీపై మండిపడ్డారు. బీజేపీని తుడిచిపెట్టగలమని కర్ణాటకలో నిరూపించామన్నారు. తాము వారిని కేవలం ఓడించలేదని.. తుడిచిపెట్టేశామన్నారు రాహుల్. కర్ణాటకలో బీజేపీ అన్ని శక్తులను ఒడ్డి పోరాడిందని రాహుల్ చెప్పారు. అయినప్పటికీ.. కాంగ్రెస్ ఆ పార్టీని తుడిచిపెట్టేసిందని వ్యాఖ్యానించారు.

తెలంగాణలోనూ అదే జరగబోతోందని రాహుల్ జోస్యం చెప్పారు. తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అలాగే, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ బీజేపీ కనిపించకుండా పోతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ చేస్తున్న విద్వేష రాజకీయాలతో ముందుకెళ్లలేమని దేశ ప్రజలు గుర్తించడమే ఇందుకు కారణమన్నారు.
ఇక 2024 ఎన్నికల్లోనూ బీజేపీని ఓడిస్తామన్నారు రాహుల్. ప్రతిపక్షాలు ఏకమయ్యాయని తెలిపారు. అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఓ వైపు బీజేపీ విద్వేష సిద్ధాంతం.. మరోవైపు కాంగ్రెస్ ప్రేమ పూర్వక సిద్ధాంతం ప్రజల ముందున్నాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. న్యూయార్క్, వాషింగ్టన్, శాన్ ఫ్ట్రాన్సిస్కోలో కార్యక్రమాలను ముగించుకుని మాన్హాటన్ చేరుకోనున్నారు. ప్రవాసభారతీయులతో మాట్లాడి, వారితో కలిసి రాహుల్ ఇష్టాగోష్టి నిర్వహించనున్నారు. కాగా, రాహుల్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. స్వదేశం గురించి విదేశాల్లో అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. భారతదేశంపై రాహుల్కు ఎలాంటి ప్రేమ, గౌరవం లేదని ధ్వజమెత్తుతున్నారు.












Click it and Unblock the Notifications