#BabaKaDhabha: సోషల్ మీడియా మార్చిన తలరాత: వృద్ధ దంపతుల టిఫిన్ కోసం జనం క్యూ
న్యూఢిల్లీ: బాబా కా ధాబా.. దేశ రాజధానిలోని మాలవీయ నగర్లో వృద్ధ దంపతులు నిర్వహిస్తోన్న ఓ రోడ్ సైడ్ కాకా హోటల్. నిన్నటి దాకా దీని పేరు ఎవరికీ తెలియదు. తెలిసినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ముందు.. ఓ మోస్తరుగా స్థానికుల ఆకలి తీరుస్తుండేది ఈ టిఫిన్ సెంటర్. అలాగే.. ఆ వృద్ధ దంపతుల కడుపునూ నింపేది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత.. ఆ వృద్ధ దంపతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది.
కరోనా దుర్భర పరిస్థితుల్లో..
80 సంవత్సరాలకు పైగా వయస్సున్న వృద్ధులు వారు. లాక్డౌన్ సడలింపుల తరువాత ఈ టిఫిన్ సెంటర్ను పునఃప్రారంభించినప్పటికీ.. దాని వైపునకు కనీసం తొంగి చూసే వారు కూడా కనిపించలేదు. ఎవరో ఒకరు వస్తారనే ఆశతో ఆ వృద్ధ దంపతులు వండిన వృధా అయ్యేవి. చాలాకాలం పాటు దుర్భర పరిస్థితులను అనుభవించారు వారు. రోజూ రుచికరమైన ఆహార పదార్థాలను వండటం.. టిఫిన్ సెంటర్కు వచ్చే వారు లేకపోవడంతో దాన్ని వృధాగా పారబోయడం.. చాలాకాలం పాటు ఇదే దుస్థితిని అనుభవించారు వారు.
ఎంట్రప్రెన్యుర్ జోక్యం..
బహుశా ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగి ఉండేదేమో. వసుంధర తన్ఖా శర్మ అనే ఓ మహిళా ఎంట్రప్రెన్యుర్ చొరవ తీసుకునిపోక పోయి ఉంటే.. క్రమంగా ఆ బాబా కా ధాబా.. కాల గతుల్లో కలిసి పోయీ ఉండేదే. ఆ కాకా హోటల్ పరిస్థితిని గమనించిన ఆమె ఈ వృద్ధ దంపతులతో మాట్లాడారు. తమ ఆవేదనను వినే వారు ఉన్నారనే ఆర్ధ్రత ఆ వృద్ధుడిని కన్నీటి పర్యంతం చేసింది. వసుంధరతో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా బోరుమన్నారాయన. తన దుస్థితిని వివరించారు. ఎంత రుచికరంగా వండినప్పటికీ.. కరోనా భయం వల్ల ఎవరూ రావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
80 ఏళ్ల వయస్సులో..
80 ఏళ్ల వయస్సులో ఆ వృద్ధుడు కన్నీటి పర్యంతం కావడం వసుంధరను కలిచివేసింది. వారిని ఆదుకోవడం తన ఒక్కరి వల్ల కాదని గ్రహించారు. ఆ వృద్ధుడి ఆవేదనను వీడియో తీశారు. దాన్ని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దయచేసి, మాలవీయ నగర్లో ఉన్న బాబా కా ధాబాకు వెళ్లి భోజనం చేయండి.. అంటూ వేడుకున్నారు. అంతే. ఒక్కసారిగా వైరల్గా మారిందా వీడియో. బాబా కా ధాబా వృద్ధుల ఆవేదనను ప్రపంచానికి తెలియజేసింది. కొన్ని గంటల వ్యవధిలో సోషల్ మీడియాను షేక్ చేసి పడేసింది.
జనం బారులు..
ఈ వీడియో చూసిన ఆమ్ ఆద్మీ పార్టీకి మాలవీయ నగర్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి.. ఈ ఉదయాన్నే బాబా కా ధాబా టిఫిన్ సెంటర్కు వెళ్లారు. అక్కడే రోడ్డు పక్కన నిల్చుని టిఫిన్ చేశారు. వృద్ధ దంపతులతో మాట్లాడారు. తాము ఉన్నామనే భరోసా ఇచ్చారు. దానికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఢిల్లీ వాసులూ! బాబా కా ధాబాకు వెళ్లడం మర్చిపోవద్దు.. అంటూ కామెంట్స్ చేశారు. ఆ కొద్దిసేపటికే జనం తాకిడి మొదలైది. టిఫిన్ సెంటర్ ముందు ఢిల్లీ జనం బారులు తీరారు. వండిన వంటలన్నీ క్షణాల్లో ఖాళీ అయ్యాయి. టాప్ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు సైతం బల్క్ ఆర్డర్ను ఇచ్చారు.
బాలీవుడ్ సెలెబ్రిటీలు మొదలుకుని క్రికెటర్ల వరకు
ఈ వీడియోను చూసిన తరువాత సాధారణ ప్రజలే కాదు..సెలెబ్రిటీలు సైతం స్పందించారు. వారిని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. రవీనా టండన్, రణ్దీప్ హుడా, స్వరా భాస్కర్, నిమ్రత్ కౌర్, గౌరవ్ వాసన్, క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, సోనమ్ కపూర్, సునీల్ షెట్టి, ఆదిత్య షెట్టి వంటి పలువురు సెలెబ్రిటీలు వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఢిల్లీకి చెందిన పలు రాజకీయ నేతలు.. తమ పార్టీ కార్యాలయాలకు టిఫన్లు, భోజనాలను పంపించాలంటూ ముందుగానే అడ్వాన్స్ మొత్తాన్ని ఇవ్వడం కనిపించింది. ఇదంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒకే ఒక్క వీడియోతో సాధ్యమైంది.
This video completely broke my heart. Dilli waalon please please go eat at बाबा का ढाबा in Malviya Nagar if you get a chance 😢💔 #SupportLocal pic.twitter.com/5B6yEh3k2H
— Vasundhara Tankha Sharma (@VasundharaTankh) October 7, 2020
Recommended Video
Champ @arjunbhatigolf is here to support PM @narendramodi 's #VocalForLocal @ThePlacardGuy #BABAKADHABA pic.twitter.com/MuJCpLOzLZ
— Ashutosh🇮🇳 (@iashutosh23) October 8, 2020












Click it and Unblock the Notifications