యూటర్న్: దినకరన్ కు 87 మంది ఎమ్మెల్యేల మద్దతు: ఏం జరుగుతోంది!
తమిళనాడు రాజకీయాలు మలుపుతిప్పడానికి జైల్లో ఉన్న శశికళ పావులు కదుపుతున్నారని తెలిసింది.
చెన్నై: తమిళనాడు రాజకీయాలు మలుపుతిప్పడానికి జైల్లో ఉన్న శశికళ పావులు కదుపుతున్నారని తెలిసింది. తను నియమించిన కొందరు నాయకులను తెర మీదకు తీసుకు వచ్చి ప్రజలను అయోమయానికి గురి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని వెలుగు చూసింది.
అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళ ఇప్పుుడు మన్నారుగుడి మాఫియా సహాయంతో తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారని సమాచారం. అందుకు అద్దంపట్టినట్లు కొందరు నాయకులు గళం విప్పుతున్నారు. టీటీవీ దినకరన్ కు ఎక్కువ మెజరిటీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారనే నినాదాన్ని తెరమీదకు తీసుకు వచ్చారు.
టీటీవీ దినకరన్ చేతిలో
జైలుకు వెళ్లిన శశికళ తన బినామి అయిన టీటీవీ దినకరన్ చేతికి అన్నాడీఎంకే పగ్గాలు అప్పగించారు. టీటీవీ దినకరన్ కు అన్నాడీఎంకే పగ్గాలు అప్పగించి ఆమె చాల తప్పు చేశారు. టీటీవీ దినకరన్ కు పార్టీ పగ్గాలు అప్పగించడం మొదటి నుంచి మాన్నార్ గుడి ఫ్యామిలీకే ఇష్టం లేదు.
దెబ్బకు సీన్ రివర్స్
అన్నాడీఎంకే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి అయిన నేను చెప్పిందే జరుగుతుందని టీటీవీ దినకరన్ అత్యుత్సాహం చూపించారు. దినకరన్ చేసిన పనికి ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వమే ఇబ్బందిలో పడింది.
చక్రం తిప్పుతున్న శశికళ ?
ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఒక్కటి కావాలని ప్రయత్నిస్తున్న సమయంలో జైల్లో ఉన్న శశికళ చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. కొత్తగా ఇప్పుడు ఆమె తన వర్గంలోని ఓ నాయకుడిని తెర మీదకు తీసుకు వచ్చి అందరికి షాక్ ఇచ్చారు.
దినకరన్ అంటే హీరోనా ?
ఎన్నికల యంత్రాంగానికి రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు టీటీవీ దినకరన్ ను అరెస్టు చేశారు. ప్రస్తుతం టీటీవీ దినకరన్ ను చెన్నై తీసుకు వచ్చి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు దినకరన్ ను హీరో చెయ్యడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు.
దినకరన్ కు 87 మంది ఎమ్మెల్యేల మద్దతు ?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఇప్పటికే అధికారం కోసం కోట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు శశికళ రెచ్చగొడుతున్న ఆమె వర్గంలోని అధికార ప్రతినిధి నంజిల్ సంతప్ దినకరన్ కు 87 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందని బిసెంట్ నగర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కొత్త బాంబు పేల్చారు.
ఎంత మంది ఎమ్మెల్యేలు, ఎవరికి మద్దతు ?
అన్నాడీఎంకే పార్టీలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ? ఎవరికి మద్దతు ఇస్తున్నారు ? అనే విషయం అర్థం కాక ఆ పార్టీ నాయకులు అయోమయంలో పడిపోయారు. అధికారంలో ఉన్న ఎడప్పాడికి 122 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందని నిరూపించుకున్నారు.
ఆయన, ఈయన
అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు అనేక వర్గాలుగా చీలిపోయారని అంటున్నారు. ఎడప్పాడి, పన్నీర్, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మూడు వర్గాలుగా చీలిపోయారు. ఇప్పుడు కటకటాలపాలైన టీటీవీ దినకరన్ కు 87 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మరో కొత్త నినాదం తెర మీదకు తీసుకు వచ్చి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నది.