ఆ శునకాల మౌన రోదన హృదయ విదారకం ...కేరళ కొండ చరియలు విరిగి పడిన ప్రమాదం
కేరళ రాష్ట్రంలో మున్నార్ సమీపంలో ఉన్న పెట్టిముడి ప్రాంతంలోని రాజమలైలో భారీవర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 43 మంది మృతదేహాలను వెలికితీశారు. శిధిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కేరళ రాష్ట్రంలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో ఘటన జరిగిన ప్రాంతంలో 2 పెంపుడు కుక్కలు తమ యజమానుల కోసం పగలు, రాత్రి తేడా లేకుండా వెతుకుతున్న తీరు హృదయవిదారకంగా మారింది.
Recommended Video

ప్రమాద ఘటన నాటి నుండి సంఘటనా స్థలంలోనే రెండు పెంపుడు కుక్కలు
కొండ చరియలు విరిగి పడిన ఘటనలో చాలామంది జల సమాధి కాగా, దాదాపు 30 ఇళ్ళు వరకు నేలమట్టమయ్యాయి. మట్టి పెళ్లల కింద చాలామంది చిక్కుకుపోయినట్లుగా తెలుస్తుంది. సహాయక బృందాలు ఇంకా మృతదేహాలను వెలికి తీసే పనిలో నిమగ్నమై పనిచేస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ప్రమాదం జరిగిన రోజు నుంచి 2 శునకాలు సంఘటన స్థలంలో తమ యజమానుల కోసం మౌనంగా రోదిస్తున్నాయి .ఏ శవాన్ని వెలికితీసినా తమ యజమాని ఏమోనని ఆ మృతదేహం వద్దకు వచ్చి వాసన చూసి తిరిగి వెనక్కి వెళ్లి పోతున్నాయి.

ఏమీ తినకుండా తమ యజమానుల కోసం కుక్కల మౌన రోదన
ప్రమాదం జరిగిన నాటి నుండి నేటి వరకు ఏమీ తినకుండా పగలు రాత్రి తేడా లేకుండా అక్కడే ఉంటున్నాయి. పెంపుడు కుక్కల పరిస్థితిని అర్థం చేసుకున్న సహాయక సిబ్బంది వాటికి ఆహారాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినా అవి మాత్రం ఏమీ తినడం లేదు. విశ్వాసానికి ప్రతీకగా చెప్పే కుక్కలు, తమ యజమానుల కోసం రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న వారందరి మనసులను కలచివేస్తోంది.

ఏ మృతదేహాన్ని వెలికి తీసినా వెళ్ళి వాసన చూస్తున్న శునకాలు
ఏ మృతదేహాన్ని వెలికి తీసినా తమ యజమాని ఏమోనని ఆ మృతదేహం వద్దకు వెళ్లి వాసన చూసి తమ వారు కాదని నిరాశగా వెనక్కు వస్తున్నాయి. సహాయక చర్యలు చేపడుతున్న అక్కడివారు ఆ కుక్కల పరిస్థితిని చూసి చలించి వాటిని అక్కడినుంచి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అవి మాత్రం దిగాలు చెందిన కళ్ళతో అక్కడే ఉంటూ ఎవరు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న రామని మొండికేస్తున్నాయి. తమని ఇంతకాలం పెంచిన యజమానులు తిరిగి వస్తారని ఆశతో కుక్కలు ఎదురుచూస్తున్నాయి.

కుక్కల వేదన హృదయ విదారకం .. తమ వారి కోసం ఆశగా నిరీక్షణ
సంఘటనా స్థలంలో ఘటన జరిగిన రోజు నుంచి నేటి వరకు తమ యజమానుల కోసం ఆ కుక్కలు పడుతున్న వేదన, మౌనంగా అవి రోదిస్తున్న తీరు, తమ వారు తిరిగి రావాలని, తిరిగి వస్తారని ఆశగా ఎదురు చూస్తున్న వాటి పరిస్థితి అక్కడ ఉన్న వారందరి మనసులనూ కదిలించి వేస్తోంది. మనుషులే మానవసంబంధాలను, అనుబంధాలను మర్చిపోతున్న నేటి రోజుల్లో జంతువులైనా తమను పెంచిన వారి పట్ల ఇంత ప్రేమను చూపించడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసినా ,అందరినీ ఆలోచించేలా చేస్తోంది.












Click it and Unblock the Notifications