పెట్రోల్, డీజిల్ తో పాటు ఈ నిత్యావసర ధరలు కూడా పెంపు..??
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. లీటర్ పెట్రోల్ పై రూ. 3 అలాగే డీజిల్ పై రూ. 3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల నిత్యావసర వస్తువులైన కిరాణా సరుకులు, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, పాలతో పాటు పాల ఉత్పత్తుల ధరలనూ గణనీయంగా పెంచుతుంది. ఇది సామాన్యుడి ప్రయాణ ఖర్చులకు కూడా భారంగా మారుతుంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల ఎఫ్ఎంసీజీ కంపెనీల రవాణా ఖర్చుల భారం పెరుగుతుంది. బిస్కెట్లు, నూడుల్స్, వంట నూనెలు, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు, పానీయాల వంటి సరుకులు లాజిస్టిక్స్ నెట్వర్క్లపై పూర్తిగా ఆధారపడి ఉంటాయి. వీటి మొత్తం నిర్వహణ ఖర్చులో 6-10 శాతం రవాణాకే వెచ్చించాలి.
పెరుగుతున్న ఖర్చుల ప్రభావం పాల ధరలపై ఇప్పటికే కనిపిస్తోంది. రవాణా, నిర్వహణ వ్యయాలు పెరిగాయని పేర్కొంటూ అముల్, మదర్ డైరీ సంస్థలు లీటరుకు ₹2 పెంచాయి. తద్వారా పెరుగు, వెన్న, పనీర్, చీజ్, ఐస్ క్రీం వంటి పాల ఉత్పత్తుల ధరలు కూడా పెరగడం అనివార్యం. ఇంధన ధరల పెంపుదల కిరాణా సరుకుల ధరలనూ నేరుగా పెంచుతుంది. రవాణా ఖర్చులు పెరగడంతో పండ్లు, కూరగాయలు, పాలు, ప్యాకేజ్డ్ వస్తువులు ఖరీదవుతాయి.
నెలకు సుమారు రూ. 10,000 కిరాణాకు ఖర్చు చేసే కుటుంబాలు, ధరలు 5-8 శాతం పెరిగితే అదనంగా రూ. 1,000- రూ. 1,500 భారం పడుతుంది. కూరగాయలు, పండ్లు, బియ్యం, పప్పులు, వంట నూనెల ధరలు సైతం పెరిగే అవకాశం ఉంది. ఈ ఇంధన ధరల పెంపు, ఈ-కామర్స్, క్విక్ కామర్స్ సేవలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. ఇవి ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫారమ్ లు, కొరియర్, ఆన్లైన్ షాపింగ్ సంస్థల లాజిస్టిక్స్ నెట్వర్క్లపై ఆధారపడతాయి. పెరుగుతున్న ఇంధన ధరలు చివరి మైలు డెలివరీ ఖర్చులను పెంచుతాయి. దీంతో వినియోగదారులకు డెలివరీ ఛార్జీలు, తక్కువ డిస్కౌంట్లు, అధిక కనీస ఆర్డర్ ధరలు, అదనపు సేవా పన్నులు భారం అవుతాయి.

ఇంధన ధరల పెంపుదల సామాన్య గృహ బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్లు వంటి రోజువారీ నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. అదనంగా, టాక్సీ, బస్సు ప్రయాణ ఖర్చులు, కొరియర్ సేవలు, రిటైల్ సరఫరా గొలుసులు, వినియోగదారుల వస్తువుల ధరలు పెరగడంతో ప్రయాణ ఖర్చులు కూడా ఎగబాకుతాయి.












Click it and Unblock the Notifications