గుడ్ న్యూస్: పెట్రో, డీజిల్ ధరలు తగ్గింపు.. అంతటా కాదు.. అక్కడ మాత్రమే
పెట్రో మంట హీటెక్కిస్తోంది. లీటర్ పెట్రోల్ రూ.100కు చేరువవడంతో సామాన్యుడు భగ్గుమంటున్నాడు. పెట్రో, డీజిల్ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని ఆర్బీఐ గవర్నర్ కూడా కామెంట్ చేశారు. ప్రజలు కూడా పెట్రో మంటపై కాస్త కోపంతోనే ఉన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వేళ పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రో డీజిల్పై ఉన్న వ్యాట్ ట్యాక్స్ను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వాహనదారులకు ఊరట కలిగింది.
పుదుచ్చేరిలో వ్యాట్ టాక్స్ తగ్గిస్తూ రాష్ట్ర లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. పెట్రోల్, డీజల్ ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. 2020 ఆగస్టు 29వ తేదిన రాష్ట్రంలో పెట్రోల్, డీజల్పై వ్యాట్ పన్నును పెంచారని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పెట్రోల్, డీజల్పై 2 శాతం వ్యాట్ తగ్గించామన్నారు. ఈ తగ్గింపుతో పుదుచ్చేరిలో గల ప్రాంతాల్లో పెట్రోల్, డీజల్ ధరలు లీటరుకు రూ.1.40 వరకు తగ్గనుందని పేర్కొన్నారు. ఈ పన్ను తగ్గింపుతో ఏడాదికి సుమారు రూ.71 కోట్లు ప్రజలకు ఆదా అయ్యే అవకాశముందని గవర్నర్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
దేశంలో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రో ధరలను తగ్గించాలని నిన్న భారత్ బంద్ కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. బంద్కు అన్నీ వర్గాలు మద్దతు తెలిపాయి. పెట్రో ధరల పెంపుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయిల్ సంస్థలను కూడా ప్రవేటీకరించాలని సోషల్ మీడియాలో పోస్టులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి.