పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు: తాజా రేట్లు ఇవే: ఈ ఏడాదిలో తొలిసారిగా: ఎన్నికల ఎఫెక్టేనా?
న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ వాహనదారుల జేబులను గుళ్ల చేస్తూ వచ్చిన పెట్రోల్, డీజిల్ తగ్గాయి.. అదీ స్వల్పంగానే. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లల్లో స్వల్పంగా క్షీణత కనిపించింది. వరుసగా 25 రోజుల పాటు స్థిరంగా కొనసాగిన పెట్రోల్, డీజిల్ ధరలు నేల చూపులు చూశాయి. ఇప్పటికే వరుసగా 16 సార్లు పెరిగిన పెట్రో రేట్లు.. తొలిసారిగా తగ్గాయి. పెట్రోల్ లీటరు ఒక్కింటికి 18 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 17 పైసల మేర తగ్గాయి. ఈ ఏడాదిలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఇదే తొలిసారి.
ఇంకొద్ది రోజుల్లో అయిదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వాటి రేట్లు తగ్గాయనే అభిప్రాయాలే వ్యక్తమౌతున్నాయి. తగ్గిన రేట్ల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.90.99పైసలు, డీజిల్ రూ.81.30 పైసలకు చేరింది. అయినప్పటికీ- దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ 90 రూపాయలకు పైగానే పెట్రోల్, డీజిల్ రేట్లు నమోదు అయ్యాయి. అత్యధికంగా ముంబైలో పెట్రోలు రేటు 97.40 రూపాయలు ఉంటోంది. డీజిల్ ధర 88.42లుగా రికార్డయింది.
చెన్నైలో పెట్రోలు 92.95, డీజిల్ ధర 86.29, కోల్కతలో పెట్రోలు రూ.91.18 పైసలు, డీజిల్ ధర రూ.84.18 పైసలు పలుకుతోంది. హైదరాబాద్లో పెట్రోల్ రూ.94.61 పైసలు, డీజిల్ ధర రూ.88.67 పైసలు, అమరావతిలో పెట్రోల్ ధర రూ.97.14, డీజిల్ రేటు రూ.90.67 పైసలుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 15 శాతం మేర తగ్గింది. దీని ఫలితంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. బ్యారెల్ క్రూడాయిల్ రేటు ఇదివరకు 71 డాలర్లు ఉండగా.. ప్రస్తుతం ఆ ధర 64 డాలర్లకు క్షీణించింది.
Recommended Video
ఈ క్షీణత ఇలాగే కొనసాగుతుందా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. ఇదివరకు పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి సెంచరీ మార్క్ను అందుకున్న విషయం తెలిసిందే. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో లీటర్ పెట్రోల్ 101.78 పైసలు పలికింది. డీజిల్ రేటు 93.77గా నమోదైంది. ప్రస్తుతం అక్కడ ఈ రెండింటి రేట్లు క్షీణించాయి. అయినప్పటికీ.. 101 రూపాయలకు పైగానే ఉంటోంది. తాజాగా సవరించిన రేట్ల ప్రకారం.. శ్రీగంగానగర్లో పెట్రోల్ రేటు లీటర్కు రూ.101.65 పైసలు, డీజిల్ రూ.93.60 పైసలుగా నమోదైంది.