ఆ అవార్డును మోడీ వాపస్ చేయాలి, లేదంటే దేశాన్ని అగౌరవపర్చినవారవుతారు: శశి థరూర్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తాను అందుకున్న ప్రతిష్టాత్మక ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డును తిరిగి ఇచ్చేయాలని కాంగ్రెస్ నేత శశిథరూర్ డిమాండ్ చేశారు. ఆ అవార్డును స్వీకరించడం అంటే దేశాన్ని అగౌరవపర్చినట్లే అని ఆయన అన్నారు. ఆ అవార్డు ఒక బోగస్ అవార్డుగా చెబుతూ ఇందుకు సంబంధించిన కథనం ఓ పత్రికలో వచ్చిందని థరూర్ వివరించారు.
ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డును మోడీకి కాకుండా మోడీ భజన చేస్తున్న బీజేపీ నేతలకు ఇవ్వాలని శశిథరూర్ ట్వీట్ చేశారు. ప్రధాని కార్యాలయం వెంటనే అవార్డును వాపస్ చేయాలని శశిథరూర్ డిమాండ్ చేశారు. ప్రపంచ మార్కెటింగ్ సమాఖ్య (డబ్ల్యూఎమ్ఎస్) ప్రధాని మోడీకి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు అందజేసింది. దీంతో విమర్శకులు అవార్డుపై పలు ప్రశ్నలు సంధించారు. వెంటనే ఈ అవార్డు తీసుకోవడాన్ని తప్పు బడుతూ మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లాలు విమర్శలు ఎక్కుపెట్టారు.
ఫిలిప్ కోట్లర్ అవార్డును భవిష్యత్తులో నోబెల్ అవార్డుతో సమానంగా పోలుస్తారని మరో నేత ట్వీట్ చేశారు. ఇక ప్రధాని మోడీకి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు రావడంపై తాను అభినందిస్తున్నట్లు చెప్పిన రాహుల్ గాంధీ... ఆ అవార్డుకు ఒక జ్యూరీ లేదని , ఇంతకు ముందెన్నడూ ఈ అవార్డు ఎవ్వరికీ ఇవ్వలేదని దీని వెనక ఓ అలిఘర్ కంపెనీ ఉన్నట్లు సమాచారం ఉందని ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉంటే దీనిపై స్పందించారు ప్రముఖ మార్కెటింగ్ గురు ఫిలిప్ కోట్లర్. ఈ అవార్డు తొలిసారిగా ప్రధాని మోడీకి ఇవ్వడాన్ని తాను ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు మోడీ భారత్కు చేసిన సేవలకుగాను, మంచి నాయకుడిగా ఉన్నందుకు, దేశ అభివృద్ధిలో నిర్వరామంగా కృషి చేసినందుకు ఈ అవార్డు ఇవ్వడం జరిగిందన్నారు.