పూలన్ దేవి హత్య: షేర్ సింగ్ రాణాకు జీవిత ఖైదు
న్యూఢిల్లీ: రాజకీయ నాయకురాలిగా మారిన బందిపోటు రాణి పూలన్ దేవి హత్య కేసులో దోషిగా ఢిల్లీ కోర్టు గురువారం శిక్షను ఖరారు చేసింది. షేర్ సింగ్ రాణాకు కోర్టు జీవిత ఖైదు విధించడంతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిుంచింది. పూలన్ దేవి 2001లో హత్యకు గురైంది.
పూలన్ దేవి హత్య కేసులో షేర్ సింగ్ రాణాను దోషిగా నిర్ధారిస్తూ అదనపు సెషన్స్ న్యాయమూర్తి భరత్ పరాశర్ ఈ నెల 8న తేదీన తీర్పు చెప్పి శిక్ష ఖరారును 14వ తేదీకి వాయిదా వేశారు. రాణాకు మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వాదించింది.

1981లో ఠాకూర్ కమ్యూనిటికీ చెందిన 17 మందిని ఊచకోత కోసినందుకు ప్రతీకారంగానే షేర్ సింగ్ రాణా పూలన్ దేవిని కాల్పి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కున్నాడు. పూలన్ దేవిపై బండిట్ క్వీన్ అనే సినిమా కూడా వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మిర్జాపూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆమె హత్య 2001 జులై 25వ తేదీన జరిగింది.
హత్య చేయడంలోని ఉద్దేశ్యాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని షేర్ సింగ్ రాణా తరఫు న్యాయవాది ముకేష్ కలియా అన్నారు. తన ప్రతిష్టను దిగజార్చడానికి పోలీసులు తప్పుడు కేసు బనాయించారని రాణా ఆరోపించాడు. సమాజానికి తాను ఏదో కొంత మంచి చేయాలని అనుకుంటున్నట్లు అతను తెలిపాడు.












Click it and Unblock the Notifications