దేశ రాజధానిలో భారీ పేలుళ్లకు పాక్ కుట్రలు: ఆరుగురు ఉగ్రవాదుల అరెస్ట్
న్యూఢిల్లీ: భారత్లో పాకిస్థాన్ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. పండగలను లక్ష్యంగా చేసుకుని భారీ పేలుళ్లకు ప్రణాళికలు రచించిన పాక్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్లోని ఐఎస్ఐలో శిక్షణ పొందిన ఇద్దరు ఉగ్రవాదులు సహా మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
నిఘా సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు అప్రమత్తమైన పోలీసులు.. ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో మంగళవారం ఉదయం నుంచి గాలింపు చేపట్టారు. రాజస్థాన్లోని కోటలో మహారాష్ట్రకు చెందిన ఓ ఉగ్రవాది పట్టుబడినట్లు ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు తెలిపారు.
Recommended Video
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యాంటీ టెర్రర్ స్క్వాడ్(ఏటీఎస్) సహాయంతో ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో మరో ఇద్దరిని పట్టుకున్నట్లు ఢిల్లీ ప్రత్యేక పోలీస్ విభాగం సీనియర్ అధికారి నీరజ్ ఠాకూర్ తెలిపారు. వీరిలో ఇద్దరు ఉగ్రవాదులకు పాకిస్థాన్లోని ఓ ఫాంహౌస్లో 15 రోజులపాటు ఉంచి ఆయుధాల వినియోగంపై శిక్షణ కూడా ఇచ్చారని పోలీసులు తెలిపారు. యూపీలో అరెస్ట్ చేసిన ఉగ్రవాదుల నుంచి ఐఈడీ బాంబులతోపాటు పలు పేలుడు పదార్థాలు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టైన ఆరుగు ఉగ్రవాదులను జాన్ మొహమ్మద్ షేక్(47), ఒసామా సమి(22), మూల్చంద్ లాలా(47), జీషాన్ కమల్(28), మొహమ్మద్ అబూబాకర్(23), మొహమ్మద్ జావేద్(31) ఉన్నారు. లక్నో, రాయ్ బరేలీ, ప్రయాగ్ రాజ్, ప్రతాప్ గడ్ లలో ఏకకాలంలో సోదాలు జరిపినట్లు అదనపు డీజీపీ(లా అండ్ ఆర్డర్)) ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రయాగ్ రాజ్లో ఒక లైవ్ ఐఈడీని స్వాధీనం చేసుకుని, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ దీన్ని నిర్వర్యం చేసినట్లు వెల్లడించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.