మరోసారి ప్రజల ముందుకు ప్రధాని : ఏం చెప్పబోతున్నారు : ఉచిత వ్యాక్సినేషన్ ప్రకటన చేస్తారా..!!
ప్రధాని మోదీ మరోసారి ప్రజల ముందుకు రాబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనాకు సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రధాని ఈ విధంగానే ప్రజల ముందుకు వచ్చి వారికి పరిస్థితులను వివరించి కీలక నిర్ణయాలను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక, ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. కేసుల సంఖ్య లక్షకు తగ్గిపోయింది. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తోంది. థర్డ్ వేవ్ అలర్ట్ ల నేపథ్యంలో కేంద్రం మరిత వేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని భావిస్తోంది.
Prime Minister Shri @narendramodi will address the nation at 5 PM today, 7th June.
— PMO India (@PMOIndia) June 7, 2021
అదే సమయంలో పలు మెట్రో నగరాల్లో ఈ రోజు నుండి అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అవుతోంది. ఇక, వ్యాక్సినేషన్ల విషయంలో అనేక రాష్ట్రాలు కేంద్రం పైన ఒత్తిడి పెంచుతున్నాయి. వ్యాక్సిన్ల సరఫరాతో పాటుగా కేంద్రమే పంపిణీ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇక, కేంద్రం ఇప్పటికే విదేశీ టీకాల దిగుమతికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న కోవాగ్జిన్..కోవీషీల్డ్ తో పాటుగా స్పుత్నిక్... ఫైజర్...మోడార్నా.. జాన్సన అండ్ జాన్సన్ వంటి సంస్థలతో నూ సంప్రదింపులు నిర్వహించారు. వచ్చే నెల నుండి రోజుకు కోటి మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకుంది. దీంతో...దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ భారం పూర్తిగా తామే తీసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా పలు రాష్ట్రాల సీఎంలు ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని..అయితే, కేంద్రం వ్యాక్సిన్లను సరఫరా చేయాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో...కేంద్రమే ఇప్పటి వరకు వ్యాక్సిన్లను అందిస్తున్న తరహాలోనే పూర్తిగా వ్యాక్సిన్లను సరఫరా నిర్ణయాన్ని ప్రధాని ప్రకటించే అవకాశం ఉంది. దీని ద్వారా అన్ని విమర్శలకు ఒకటే నిర్ణయంతో చెక్ పెట్టవచ్చనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయతే, ప్రయివేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ తీసుకొనే సామర్ధ్యం ఉన్న వారు మాత్రం నిర్ధారించిన ధరను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రధాని ప్రసంగం పైన ఆసక్తి నెలకొని ఉంది.