రేపు ఒకేసారి పట్టాలెక్కనున్న రెండు వందే భారత్ రైళ్లు- ఇక హవా మొదలైనట్టే..!!
రేపు ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లు పట్టాలెక్కబోతోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ముంబై నుంచి షిర్డీ, షోలాపూర్ మధ్య ఈ రెండు రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రజాదరణను పొందుతోన్నాయి. ఏపీ-తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఈ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు ఎనిమిది రైళ్లు వేర్వేరు రాష్ట్రాల్లో వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్నాయి. ఈ సిరీస్ లో ఎనిమిదో రైలు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య తిరుగాడుతోంది. మిగిలిన రైళ్లతో పోల్చుకుంటే గరిష్ఠంగా మూడింతల వేగంతో- పరుగులు పెడుతోండటంతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది.

అన్ని రకాలా బెనిఫిట్స్..
ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ల రేట్లు రెట్టింపు అయినప్పటికీ ప్రయాణికులు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఫలితంగా వారి తాకిడి ఏ మాత్రం తగ్గట్లేదు. సమయం, వేగానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. వివిధ నగరాల మధ్య వందలాది కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించే విషయంలో సమయానికి గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో వందే భారత్ రైళ్లపై ఆధారపడుతున్నారు.
పట్టాలెక్కనున్న రెండు రైళ్లు..
ఈ పరిణామాల మధ్య తాజాగా రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికులకు డబుల్ ధమాకా ఆఫర్ ఇచ్చింది. ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లు పట్టాలెక్కబోతోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పచ్చజెండా ఊపి వాటిని ప్రారంభించనున్నారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

షిర్డీతో పాటు..
ఈ రెండు రైళ్లు కూడా మహారాష్ట్రలోనే తిరుగాడనున్నాయి. ముంబై- సాయినగర్ షిర్డీ, ముంబై-షోలాపూర్ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ రెండు రైళ్లు కూడా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) నుంచి ఇప్పటికే పుణే రైల్వే యార్డ్ కు చేరుకున్నాయి. ప్రారంభానికి ఒక్క రోజు ముందు ముంబైకి చేరుకుంటాయి. 10వ తేదీన ఉదయం 9 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ లో వాటిని ప్రారంభిస్తారు.

షిర్డీ రైలు టైమింగ్ ఇదీ..
ముంబై-షిర్డీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నంబర్ 22223 ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి తెల్లవారు జామున 6:20 నిమిషాలకు బయలుదేరుతుంది. ఉదయం 11:40 నిమిషాలకు షిర్డీకి చేరుకుంటుంది. డౌన్ లో నంబర్ 22224 వందే భారత్ ఎక్స్ ప్రెస్ షిర్డీ నుంచి సాయంత్రం 5:25 నిమిషాలకు బయలుదేరి రాత్రి 10:50 నిమిషాలకు ముంబై సీఎస్టీకి చేరుకుంటుంది. దాదర్, థానే, నాసిక్ రోడ్ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.

షోలాపూర్ రైలు టైమింగ్ ఇదీ..
ముంబై-షొలాపూర్ మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నంబర్ 22225 ముంబై సీఎస్టీ నుంచి సాయంత్రం 4:05 నిమిషాలకు బయలుదేరి రాత్రి 10:40 నిమిషాలకు షోలాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 22226 నంబర్ ఎక్స్ ప్రెస్ షోలాపూర్ లో తెల్లవారు జామున 6:05 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 12:35 నిమిషాలకు ముంబై సీఎస్టీకి చేరుకుంటుంది. దాదర్, కళ్యాణ్, పూణే, కుర్దువాడి స్టేషన్లలో ఆగుతుంది.












Click it and Unblock the Notifications