ప్రధానితో మరికొద్ది గంటల్లో జమ్మూకాశ్మీర్ నేతలు భేటీ: రాష్ట్ర హోదా సహా కీలక అంశాలపై చర్చ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో జమ్మూకాశ్మీర్ రాజకీయ పార్టీల నేతలు మరికాసేపట్లో భేటీ కానున్నారు. జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇచ్చే విషయంతోపాటు పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జమ్మూకాశ్మీర్ కు చెందిన 8 పార్టీల 14 మంది నేతలు ప్రధానితో సమావేశంలో పాల్గొననున్నారు.
2019, ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే జమ్మూకాశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజన కూడా చేశారు. అయితే, ఆ సమయంలో జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మోడీ సర్కారు
స్పష్టం చేసింది.

2018లో బీజేపీ-మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నుంచి జమ్మూకాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ, జమ్మూకాశ్మీర్ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో భేటీ నేపథ్యంలో ఇప్పటికే జమ్మూకాశ్మీర్ రాజకీయ నేతలు దేశ రాజధానికి చేరుకున్నారు.
జమ్మూకాశ్మీర్లో బీజేపీకి వ్యతిరేకంగా ఏడు పార్టీలు కలిసి గుప్కార్ కూటమిని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(పీజీడీ)లో పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పీడీపీ), నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)తోపాటు ఏడు పార్టీలున్నాయి. గత కొంతకాలం క్రితం జరిగిన జిల్లా అభివృద్ధి మండళి(డీడీసీ) ఎన్నికల్లోనూ ఈ పార్టీలు కూటమిగానే పోటీ చేసి మెరుగైన ఫలితాలను సాధించాయి. అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.
కాగా, జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్ రాజకీయ నేతలతో ప్రధాని మోడీ సమావేశం నేపథ్యంలో ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకాశ్మీర్లో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications