SPG కి షాక్ ఇచ్చిన ప్రధాని! ప్రోటోకాల్ బ్రేక్, మోదీ క్షమాపణలు
రాజకీయం అంటే కేవలం ఓట్లు, సీట్లు మాత్రమే కాదు.. ప్రజల పట్ల ఉండే మర్యాద అని ప్రధాని నరేంద్ర మోదీ నిరూపించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిలిగురి చేరుకున్న ఆయన, తన పర్యటన కారణంగా అసౌకర్యానికి గురైన ఒక పెళ్లి బృందానికి స్వయంగా క్షమాపణలు చెప్పారు. ఎస్పీజీ (SPG) భద్రతా వలయాన్ని దాటుకుని వెళ్లి మరీ ఆయన సామాన్యులతో మమేకమవడం అక్కడి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
సిలిగురి పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఏప్రిల్ 12న రాత్రి బస కోసం 'మేఫెయిర్ టీ రిసార్ట్'కు చేరుకున్నారు. అయితే ప్రధాని రాకతో శుక్రవారం నుంచే ఆ ప్రాంతమంతా అత్యంత కఠినమైన భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. అదే సమయంలో, ఉత్తర బెంగాల్కు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు అక్షయ్, శ్రేయల వివాహం కూడా అదే రిసార్ట్లో జరుగుతోంది. ప్రధాని భద్రత కారణంగా పెళ్లికి వచ్చిన అతిథులు తీవ్రమైన తనిఖీలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎక్కడికక్కడ ఆంక్షలు ఉండటంతో వారు కొంత అసౌకర్యానికి గురయ్యారు.

ప్రొటోకాల్ పక్కన పెట్టి.. స్వయంగా వెళ్లి క్షమాపణలు!
ఈ విషయాన్ని గమనించిన ప్రధాని మోదీ, తన భద్రతా నిబంధనలను సైతం పక్కన పెట్టి నేరుగా పెళ్లి వేడుక జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. నూతన వధూవరుల వద్దకు వెళ్లి వారిని ఆశీర్వదించడమే కాకుండా, తన పర్యటన వల్ల వారికి కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నట్లు తెలిపారు. "నా వల్ల మీకు చాలా ఇబ్బంది కలిగింది.. దయచేసి క్షమించండి" అని ప్రధాని స్వయంగా కోరడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఒక దేశ ప్రధాని తమ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పడం ప్రతి ఒక్కరినీ ఉద్వేగానికి గురిచేసింది.
సోషల్ మీడియాలో వైరల్: 'నాయకుడంటే ఇలా ఉండాలి'
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ తన అధికారిక 'X' ఖాతాలో పంచుకుంది. "ఇది ఒక చిన్న విషయమే కావచ్చు, కానీ ప్రతి పౌరుడి ప్రత్యేక క్షణాలకు విలువనిచ్చే నాయకుడి గురించి ఎన్నో చెబుతుంది" అని పేర్కొంది. బిజీ ఎన్నికల షెడ్యూల్ ఉన్నప్పటికీ, సామాన్య పౌరుల వ్యక్తిగత వేడుకకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఆయన స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
A heartfelt moment from Narendra Modi in Siliguri 🇮🇳 where he reportedly acknowledged and apologized to a couple whose wedding was impacted due to security arrangements during his visit.#Siliguri #PMModi #India #Leadership #Viral #Respectpic.twitter.com/EOqspnMPse
— Ujjawal (@ujjawal1985519) April 13, 2026
ఎన్నికల పోరు మధ్యలో మానవీయ స్పర్శ..
పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత ఎన్నికల్లో టీఎంసీ భారీ విజయం సాధించగా, ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఉత్కంఠభరిత పోరు మధ్యలో మోదీ చూపిన ఈ మానవీయ కోణం ఓటర్ల మనసు గెలుచుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications