మార్చి 10న తొలి హోలీ - కులం పేరుతో విషం చిమ్ముతున్నారు : ప్రధాని మోదీ..!!
ఒక వైపు ఉత్తరప్రదేశ్ లో మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. మరో వైపు ప్రదాని మోదీ తన ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ది పార్టీల పైన విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధే దేశాభివృద్ధి అనే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలని కోరారు. హర్దోయ్ ర్యాలీలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేసారు. కుర్చీ కోసం కుటుంబంతో కూడా పోరాడే వారు.. సమాజానికి ఏం చేయగలరని ప్రశ్నించారు.అహ్మదాబాద్ బాంబు పేలుడు ఘటనను గుర్తు చేసుకున్న ప్రధాని. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని తేల్చి చెప్పారు.
ఈ ఏడాది హోలీ రెండు సార్లు జరుపుకుంటామని చెప్పిన ప్రధాని..వచ్చే నెల 10వ తేదీన తొలి హోలీ జరుపుకుంటామన్నారు. అందు కోసం పోలింగ్ కేంద్రాల వద్ద అందరూ సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్రంలో అయిదేళ్ల క్రితం రాష్ట్రం లో మాఫియా పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలని సూచించారు. వ్యాపార్తులు భయపడేవారన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపడుచు తిరిగి వచ్చే పరిస్థితి గతంలో లేదని చెప్పుకొచ్చారు.
యోగీ సీఎం అయిన తరువాత రాష్ట్రంలో మాఫియా..నేరాలు లేని రాష్ట్రంగా తీర్చి దిద్దారని ప్రధాని మోదీ వివరించారు. గతంలో రాష్ట్రంలో కరెంట్ కూడా ఉండేది కాదని గుర్తు చేసారు. ఎవరు చీకట్లో దోపిడీలకు పాల్పడేవారే..వాళ్లే రాష్ట్రానికి వెలుగు ఇవ్వలేదని దుయ్యబట్టారు. యూపీలో బీజేపీ హయాంలో భూకబ్జాలను అరికట్టామని చెప్పిన ప్రధాని.. డబుల్ ఇంజన్ ప్రభుత్వం యాజమాన్యం పథకం కింద 23 లక్షల మందికి పైగా ఆస్తి కార్డులు ఇచ్చిందన్నారు. ఈ పథకం మరికొంతకాలం కొనసాగుతుందన్నారు.
యోగి తిరిగి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం మరింత ముమ్మరం కానుందని ప్రధాని తెలిపారు. ఇక, మూడో విడతలో భాగంగా ఉత్తర ప్రదేశ్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎస్పీ అధినేత అఖిలేష్ తొలి రెండు విడతల్లోనే ఎస్పీ వంద సీట్లు పైగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం ఏడు విడతలకు గానూ... ఈ రోజుతో మూడు విడతల పోలింగ్ ముగియనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి.