మోడీ, బుద్దుని స్కెచ్ ఆర్ట్పై ప్రధాని సంతకం.. 6 ఒప్పందాలు.. ముగిసిన నేపాల్ టూర్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేపాల్ పర్యటన ముగిసింది. టూర్లో భాగంగా మోడీ మరో గిప్ట్ పొందారు. మోడీ, బుద్దుని స్కెచ్ ఆర్ట్ను ఒకరు బహుమతిగా నేపాల్ లుంబినిలో అందజేశారు. దానిపై మోడీ సంతకం చేశారు. ఆ సమయంలో మోడీని అందరూ చుట్టుముట్టి వందేమాతరం అనే నినాదాలు చేశారు. ఆ సమయంలో కొందరు మోడీకి బొకెలు కూడా అందజేసి వెల్కం చెప్పారు. మరికొందరు మోడీ ఆశీర్వాదం తీసుకున్నారు.
లుంబినిలో గల మోనస్టిక్ జోన్ వద్ద గల ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ బుద్దిస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్లో భాగంగా నేపాల్ ప్రధాని షేర్ బహదూర్తో కలిసి మోడీ శిలాన్యాస్ వేడుకల్లో పాల్గొన్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా లుంబినిలోని మాయాదేవి ఆలయంలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బాతో కలిసి మోదీ పూజలు నిర్వహించారు. అనంతరం మోదీ, దేవ్ బా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. విద్యా, సాంస్కృతిక రంగాల్లో 6 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

నేపాల్ కు రాముడికి విడదీయరాని సంబంధం ఉందని, నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అని మోడీ పేర్కొన్నారు. బుద్ధుడే ఇరుదేశాలను కలుపుతున్నాడని, బుద్ధుడు రాజకీయ సరిహద్దులకు అతీతుడని, బుద్ధుడు అందరివాడని మోడీ తెలిపారు.
నేపాల్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోడీ లక్నో చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో విందులో పాల్గొన్నారు. యూపీ మంత్రులతో రాష్ట్ర పాలనపై చర్చించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ క్యాబినెట్తో కలిసి మోడీ ఓ గ్రూప్ ఫొటో కూడా దిగారు. ఇటీవలి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించాక మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇది రెండోసారి.