'పుల్వామా ఘటన తెలిసి మోడీ తినలేదు, మంచినీళ్లు ముట్టలేదు.. ఆ రోజు ఏం జరిగిందంటే'
న్యూఢిల్లీ: ఓ వైపు పుల్వామా ఘటన జరిగి యావత్ భారతం బాధలో ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం తన కర్తవ్యం మరిచి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వద్ద సినిమా షూటింగులో మునిగిపోయారని కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలను ప్రభుత్వ వర్గాలు కొట్టి పారేశాయి.
పుల్వామా దాడి విషయం తెలియగానే మోడీ ఏమీ తినలేదని, తాగలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్వీయప్రచారం కోసం మోదీ టెలివిజన్ ఫిల్మ్ రూపకల్పనలో మునిగిపోయారని కాంగ్రెస్ చేసిన ప్రచారం అర్థరహితమని చెప్పారు. పుల్వామా వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగిందని తెలిసినప్పటి నుంచి ప్రధాని ఏమీ తినలేదన్నారు.

పుల్వామా ఘటన జరిగిన రోజు ప్రధాని మోడీ ఉదయం ఏడు గంటలకు ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్లారని, వాతావరణం సరిగా లేకపోవడంతో నాలుగు గంటల పాటు అక్కడే చిక్కుకుపోయారని, ఆయన ఉదయం పదకొండుంపావుకు జిమ్ కార్బెట్ పార్క్కు చేరుకున్నారని, అక్కడ మూడు గంటల పాటు ఉన్నారని చెప్పారు. అంటే అక్కడ రెండుంపావు వరకు ఉన్నట్లుగా చెప్పారు. అక్కడ నరేంద్ర మోడీ టైగర్ సఫారీ, ఎకో టూరిజం జోన్, రెస్క్యూ సెంటర్ను ప్రారంభించారని చెప్పారు. అక్కడి నుంచి మోటార్ బోట్ ద్వారా కాలాగర్కు చేరుకున్నారని చెప్పారు. అక్కడి ధికాలాను విజిట్ చేశారని చెప్పారు. ఆ తర్వాత మూడు గంటలకు (పుల్వామా దాడికి పది నిమిషాలకు ముందు) షెడ్యూల్ ప్రకారం రుద్రాపూర్ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉందని చెప్పారు.
కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ బహిరంగ సభను రద్దు చేసుకున్నారని చెప్పారు. అదే సమయంలో పుల్వామా ఘటన గురించి తెలిసి, కూడా బహిరంగ సభను రద్దు చేసుకున్నారని చెప్పారు. విషయం తెలియగానే ప్రధాని.. నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్, హోమ్ మినిస్టర్, గవర్నర్ తదితరులతో మాట్లాడారని చెప్పారు. ఆ తర్వాత రాంపూర్ గెస్ట్ హౌజ్కు చేరుకున్నారని, మళ్లీ ఎన్ఎస్ఏతో, గవర్నర్, హోంమంత్రితో మాట్లాడారని చెప్పారు. పుల్వామా ఘటన తెలిసినప్పటి నుంచి ఆ రోజు ఆయన ఏమీ తినలేదని చెప్పారు. ఆ తర్వాత రాత్రి ఏడు గంటలకు రాంపూర్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చారని చెప్పారు.
పుల్వామా దాడితో యావత్ భారతదేశం రగిలిపోతున్న సమయంలో మోడీ ఫిల్మ్ షూటింగ్లో బిజీగా ఉన్నారని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. అధికార దాహంతో మోడీ తపించిపోతున్నారని, ఓ ప్రధానిగా తన కర్తవ్యాన్ని కూడా మర్చిపోయి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వద్ద ఫిల్మ్ షూటింగ్ లో మునిగిపోయారని కాంగ్రెస్ నేత రణ్దీప్ సుర్జేవాలా అన్నారు. ఉగ్రదాడి గురించి సమాచారం తెలిసిన తర్వాత కూడా జాతీయవాదినని చెప్పుకునే ప్రధాని ఈ విధంగా ప్రవర్తించడం దారుణమన్నారు. పుల్వామా ఉగ్రదాడి మధ్యాహ్నం తర్వాత 3.10 గంటలకు జరిగితే ప్రధాని రాత్రి 7 గంటల వరకు షూటింగ్లోనే ఉన్నారంటూ ఆరోపించారు.












Click it and Unblock the Notifications