యూపీలో జెవార్ పోర్టుకు మోడీ శంఖుస్ధాపన-ఉత్తరాది ముఖద్వారంగా అభివర్ణన-కీలక వ్యాఖ్యలు
వచ్చే ఏడాది మార్చిలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న ఉత్తర్ ప్రదేశ్ లో కేంద్రం వరుసగా అభివృద్ధి పనులు చేపడుతోంది. తాజాగా పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఇవాళ నోయిడాలో కొత్తగా నిర్మించనున్న జెవార్ ఎయిర్ పోర్టు పనులకు శంఖుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర పర్యాటకం మరియు ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపునిస్తుందని అన్నారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు పర్యాటకం, ఎగుమతి మరియు ఉపాధి రంగాలకు ఊతం ఇస్తుందని ప్రధాని తెలిపారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తర భారతదేశానికి లాజిస్టిక్స్ గేట్వేగా మారుతుందని వెల్లడించారు.
జెవార్ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్ ఎగుమతులను పెంచడంతో పాటు రాష్ట్రంలోని యువతకు వేలాది ఉద్యోగాలను తెస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు. జేవార్ విమానాశ్రయం ఢిల్లీ రాజధాని ప్రాంతంతో పాటు ఉత్తర ప్రదేశ్లోని మందికి ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు.
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నేరుగా అంతర్జాతీయ మార్కెట్లతో ఒక ప్రధాన ఎగుమతి కేంద్రాన్ని అనుసంధానిస్తుందన్నారు. ఈ ప్రాంత రైతులు కూరగాయలు, పండ్లు, చేపలు వంటి త్వరగా పాడైపోయే వస్తువులను ఎగుమతి చేయడానికి వీలు కల్పిస్తుందన్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని MSMEలు విదేశీ మార్కెట్లను చేరుకోవడానికి ఇది సహాయపడుతుందన్నారు.
మరోవైపు రైతుల ప్రభావం అధికంగా ఉండే పశ్చిమ యూపీలో ఈ ఎయిర్ పోర్టు శంఖుస్ధాపన చేసిన ప్రధాని మోడీ.. వ్యవసాయ బిల్లుల తర్వాత రైతుల్ని చేరువయ్యేందుకు కూడా దీన్ని వాడుకున్నారు. ఈ ఎయిర్ పోర్టు ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మోడీ తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం, తాము ఇతర దేశాలలో విమానాల మరమ్మతుల కోసం రూ. 15,000 కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఇప్పుడు, అన్ని మరమ్మతులు, నిర్వహణ ఈ ఎయిర్ పోర్టులోనే జరుగుతుందన్నారు. ఉత్తరప్రదేశ్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేస్తున్న కృషిని ప్రశంసించిన ప్రధాని మోదీ, రాష్ట్రం.., బహుళజాతి కంపెనీలకు కేంద్రంగా మారిందని ప్రశంసించారు.