ట్రంప్ తో ఫేస్ టు ఫేస్: త్వరలో మోదీ అమెరికా టూర్: తాడో పేడో
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ లో అమెరికాలో పర్యటించనున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు ఆయన హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ముఖాముఖి సమావేశం కానున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలు, అజెండా రూపొందుతోంది.
ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలను చక్కదిద్దడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అని అధికార వర్గాలు తెలిపాయి. డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్ వల్ల భారత్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేనంత టారిఫ్ ను చెల్లించాల్సి వస్తోంది.

దీనివల్ల దేశీయంగా పలు పరిశ్రమలు దెబ్బతినే ప్రమాదం నెలకొని ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రత్యేకించి- టెక్స్ టైల్.. దాని అనుబంధ రంగాలు కుదేల్ అవుతాయనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. అమెరికా ఎగుమతులపై ఆధారపడ్డ అన్ని రంగాలనూ ఈ టారిఫ్ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
ఈ పరిస్థితుల మధ్య.. ప్రధాని మోదీ అమెరికా పర్యటన చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డొనాల్డ్ ట్రంప్ తో ముఖాముఖి భేటీ కాబోతోండటం చర్చనీయాంశమైంది. న్యూయార్క్ సెప్టెంబరు 23వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు సెప్టెంబరు చివరి వారంలో న్యూయార్క్ కు చేరుకుంటారు. ఇందులో పాల్గొనడానికి ప్రధాని మోదీ.. అమెరికాకు బయలుదేరి వెళ్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఇతర దేశాధినేతలతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
ఒకవేళ మోదీ-ట్రంప్ భేటీ జరిగితే.. ఏడు నెలల కాలంలో ఇది రెండవ సమావేశం అవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోదీ వైట్హౌస్ను సందర్శించిన విషయం తెలిసిందే. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటిసారి ఆయనను కలిశారు మోదీ.
ట్రంప్ మొదటి పదవీకాలంలో, మోదీతో ఆయనకు వ్యక్తిగత అనుబంధం ఏర్పడింది. ట్రంప్ తన రెండవ పదవీకాలంలో టారిఫ్ ల విషయంలో దూకుడుగా వ్యవహరించడం వల్ల ఆ స్నేహం దెబ్బతింది. అయినప్పటికీ ట్రంప్ మోదీని తరచుగా తన స్నేహితుడిగానే అభివర్ణిస్తుంటారు.
వచ్చే వారాల్లో మోదీ-ట్రంప్ సమావేశం సాధ్యం కావాలంటే కొన్ని కీలక అంశాలపై పురోగతి సాధించాల్సి ఉంది. మొదటిది, భారతదేశం-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో పురోగతి సాధించడం. వ్యవసాయం మరియు పాల ఉత్పత్తుల రంగాలను అమెరికాకు తెరవడానికి భారతదేశం సుముఖత చూపకపోవడంతో ఈ ఒప్పందం నిలిచిపోయింది.
ఈ వాణిజ్య ప్రతిష్టంభన మధ్య, ట్రంప్ భారతదేశంపై 25% సుంకం విధించారు. రష్యా నుండి చమురు కొనుగోళ్లను కొనసాగించినందుకు అదనంగా మరో 25% సుంకాన్ని విధించడంతో మొత్తం సుంకం 50%కి చేరింది. ట్రంప్ విధించిన ఈ 50% సుంకాల్లో సగం ఆగస్టు 7న అమలులోకి వచ్చాయి. మిగిలినవి ఆగస్టు 27న అమలులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications