లాక్డౌన్ పొడగింపు: సీఎంలకు మోదీ షాక్.. దేశానికి ఏడుపే గతి.. మే3 తర్వాతైనా ప్లాన్-బీ ఉందా?
కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకే లాక్ డౌన్ పొడగిస్తున్నామని, జనం ఎన్నికష్టాలు పడుతున్నారో తనకు తెలుసని, అయినాసరే ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేస్తూ దేశాన్నిరక్షించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్ డౌన్ పొడగింపు నిర్ణయాన్ని సమర్థిస్తూనే.. ఉద్దీపనలు ప్రకటించకపోవడాన్ని నేతలు తప్పుపడుతున్నారు. బతుకులు కాపాడుతానంటోన్న మోదీ.. ప్రజల బతుకుదెరువు గురించి మాత్రం ఆలోచించడంలేదని ఒక్కటి కూడా సరైన నిర్ణయం తీసుకోవడంలేదని దుయ్యబట్టారు. ఈ మేరకు మోదీపై కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ, ఎస్పీ సహా పలు పార్టీల కీలక నేతలు ఘాటుగా విమర్శలు చేశారు.

ఏడుపు తప్ప దారేది?
‘‘లాక్ డౌన్ కొనసాగించాల్సిన అవసరాన్ని మేం అర్థం చేసుకోగలం. కాబట్టే ఈ విషయంలో ప్రధాని మోదీకి మద్దతిస్తాం. కానీ దేశాన్ని, పేదలను కాపాడుకోడానికి ఆయన సిద్ధంగా లేరు. నిధులు కావాలని ముఖ్యమంత్రులందరూ అడిగినా, మొండిచేయి చూపారేతప్ప ఒక్కపైసా విదల్చలేదు. నిజానికి మన ఖజానాలో, గిడ్డంగుల్లో కావాల్సినంత ధనం, ధాన్యం ఉన్నాయి కూడా. వాటిని బయటికి తీసి పంచాలన్న ధ్యాస మాత్రం మోదీకి లేదు. మార్చి 25నాటి ఉద్దీపన ప్యాకేజీ కూడా చాలా పిసినారితనంగా ఉంది. రఘురాం రాజన్ నుంచి జీన్ డ్రెజ్ వరకు, ప్రభాత్ పట్నాయక్ నుంచి అభిజిత్ బెనర్జీ దాకా.. ఏ ఒక్కరి సలహాలను మోదీ పాటించలేదు. 21ప్లస్ 19 రోజులు పేదలు తమను తామే బతికించుకోవాల్సిన పరిస్థితి. ఇక నా దేశానికి ఏడుపే గతి''అని కాంగ్రెస్ ఎంపీ చిదంబరం ఫైరయ్యారు.

10లక్షల్లో 149 మందికే టెస్టులు..
కరోనా వైరస్ విషయంలో మొదటి నుంచీ హెచ్చరిస్తున్నా మోదీ సర్కార్ పెడచెవిన పెట్టిందని, మన కంటే చిన్నదేశాలతో పోల్చిచూసుకున్నా కరోనా కట్టడిలో భారత్ స్థానం కనిపించనంత దూరంలో ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. వైరస్ నియంత్రణకు మాస్ టెస్టింగ్స్ మాత్రమే పరిష్కారమని, అయితే అందుకు సరిపడా కిట్స్ ను ప్రభుత్వం సిద్ధం చేయలేకపోయిందని చెప్పారు. హండరూస్(162), లావోస్(157) లాంటి చిన్న దేశాలకంటే దారుణంగా మన దగ్గర ప్రతి 10లక్షల మందిలో కేవలం 149 మందికి మాత్రమే కరోనా టెస్టులు చేస్తున్నారని, ముందస్తుగా కిట్స్ కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రాహుల్ విమర్శించారు.

మొదటి కేసుకు ఆధారం ఏది?
దేశంలోకి వైరస్ ప్రవేశించకముందు నుంచే ఎయిర్ పోర్టుల వద్ద పెద్ద ఎత్తున టెస్టుల ప్రక్రియ చేపట్టినట్లు ప్రధాని మోదీ మంగళవారం నాటి ప్రకటనలో చెప్పారు. దీనిపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అనుమానాలు లేవనెత్తారు. నిజంగా ప్రధాని చెప్పింది వాస్తవం అయ్యుంటే.. దేశంలో మొదటి కరోనా కేసుకు సంబంధించిన ఆధారాలు కచ్చితంగా దొరికేవని, ప్రభుత్వానికి దమ్ముంటే ఆ వివరాల్ని బయటపెట్టాలని అఖిలేశ్ సవాలు చేశారు. ప్రధాని మోదీ దేశానికి పనికొచ్చే నిర్ణయం ఒక్కటీ తీసుకోనందువల్లే ఇవాళీ పరిస్థితికి దిగజారామని ఎస్పీ చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video

మే3 తర్వాతైనా?
లాక్ డౌన్-2పై ఎలక్షన్ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ సైతం తనదైన శైలిలో స్పందించారు. లాక్ డౌన్ కొనసాగించాలని ఇప్పటికే ప్రకటించారు కాబట్టి ఆ నిర్ణయంలోని హేతుబద్ధత, క్రమపద్ధతుల గురించి చర్చ అనవసరమని, అయితే మే3 తర్వాత కూడా ఆశించిన ఫలితాలు రాకపోతే ఏం చెయ్యాలన్నదానిపై దృష్టిసారించాలని అన్నారు. ‘‘మనకు ప్లాన్-బీ అయినా ఉండాలి లేదా పరిస్థితుల్ని సరిచేయాలన్న సంకల్పమైనా ఉండాలి''అని పేర్కొన్నారు.

టాస్కులు ఇవ్వలేదేం?
మే 3 వరకూ లాక్డౌన్ను పొడగిస్తూ మోదీ చేసిన ప్రకటనపై శివసేన, ఎస్పీపీలు సైతం ఫైరయ్యాయి. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి ఏం చేయబోతున్నారో ప్రధాని చెప్పకపోవడం బాధాకరమని, లాక్ డౌన్ కారణంగా అన్నీ కోల్పోయిన పేదలకు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించకపోవడం శోచనీయమని శివసేన అధికార ప్రతినిధి మనీషా కయాండే అన్నారు. లాక్ డౌన్ లో చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం లాంటి పిలుపులిచ్చిన మోదీ, ఈసారి అలాంటి టాస్కులేవీ ఇవ్వలేదని కయాండే ఎద్దేవా చేశారు.

ఇదీ పరిస్థితి..
మంగళవారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం కొవిడ్-19 కేసుల సంఖ్య 10815కు పెరిగింది. అందులో 1190 మంది కోలుకోగా, 353మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 1211 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడంతో తొలుత ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ ను మరో 19 రోజులు, అంటే మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.












Click it and Unblock the Notifications