నన్ను చంపిస్తారేమో: మోడీపై కేజ్రీవాల్ సంచలనం
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్కేజ్రీవాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తనను హత్య చేయిస్తారేమోనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆన్లైన్లో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో ఈ ఆరోపణలు చేశారు కేజ్రీవాల్.
బిజెపి ప్రభుత్వం మునుపెన్నడూ లేని రీతిలో అణచివేతకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యేలు అత్యున్నత త్యాగానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరన్నర కాలంలో ఆప్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వరసగా అరెస్టు కావడాన్ని ప్రస్తావిస్తూ.. పార్టీ కార్యకర్తలకు ఈ వీడియో సందేశం ఇచ్చారు.
అంతేగాక, తమపై అణచివేత ప్రక్రియ వెనక ప్రధాన సూత్రధారి మోడీ అని ఆరోపించారు. తమ పార్టీని సంపూర్ణంగా ఓడించాలనే కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ప్రస్తుత దశ చాలా కీలకమైనదనీ, రాబోయే రోజులు మరింత దిగజారుతాయనీ, దీనిపై ఆలోచించాలనీ, కుటుంబాలతో మాట్లాడాలని ఆప్ వాలంటీర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులను ఉద్దేశించి పేర్కొన్నారు.
మోడీ ఎంతదూరమైనావెళ్తారనీ, తనను చంపేయించవచ్చునని కేజీవాల్ ఆరోపించారు. పది మంది ఆప్ ఎమ్మెల్యేలు అరెస్టవడం, ఓ ఎమ్మెల్యేపై ఆదాయపన్ను దాడులు జరగడం, పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులైన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు యత్నించడాన్ని ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రస్తావించారు.

సిగ్గుమాలిన వ్యాఖ్యలు: కేజ్రీవాల్పై బిజెపి
కేజ్రీవాల్ సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారనీ, వాటిని ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్శర్మ మండిపడ్డారు. ఆప్ నేతలు నేరాలకు పాల్పడకుండా అరికట్టడంలో విఫలమైన కేజ్రీవాల్.. ప్రధాని విమర్శలు చేయడం సిగ్గు చేటని అన్నారు.
ఢిల్లీ రాష్ట్ర పాలనలో అసమర్థత, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించక కేజ్రీవాల్ నిరాశతో ఉన్నారనీ, ఆయన వ్యాఖ్యలు పదవీ స్థాయికి తగినట్లుగా లేవని బిజెపి అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.
కాగా, ఇప్పటి వరకు అవినీతి, ఇతన నేరారోపణలతో 11మంది ఆప్ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications