ఎట్టకేలకు స్వదేశానికి టీమిండియా-ఘనస్వాగతం-ప్రధాని మోడీతో భేటీ.!
అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిధ్యం ఇచ్చిన టీ20 వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలిచిన టీమిండియా క్రికెటర్లు ఇవాళ ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా రెండు రోజులుగా బార్బడోస్ లోనే ఉండిపోయిన వీరు.. ఇవాళ ఉదయం ఢిల్లీకి వచ్చారు. ఉదయం 6:05 గంటలకు టీ20 ప్రపంచ ఛాంపియన్లతో కూడిన ఎయిరిండియా విమానం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.
ఉదయం 7:00 గంటలకు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు విమానాశ్రయం నుండి బయటకు వెళ్లి వారి టీమ్ బస్సు ఎక్కింది. జట్టులోని ఇతర సభ్యులు ముందుగా జట్టు బస్సు ఎక్కగా, కెప్టెన్ రోహిత్ చేతిలో టీ20 ప్రపంచ కప్ ట్రోఫీతో బయటికి వెళ్లాడు. జగజ్జేతగా నిలిచి స్వదేశానికి చేరుకున్న భారత క్రికెటర్లను స్వాగతిస్తూ అభిమానులు సందడి చేశారు. దీంతో క్రికెటర్లు కూడా అభిమానులతో కలిసి కాసేపు చిందేశారు.

అనంతరం వీరు ప్రధాని మోడీ నివాసానికి చేరుకున్నారు. మోడీతో భేటీ అయి టీ20 వరల్డ్ కప్ విజయాన్ని ఆయనకు వివరించారు. దీంతో మోడీ కూడా వీరిని అభినందనలతో ముంచెత్తారు. బార్బడోస్ లో తుపాను కారణంగా చిక్కుకుపోవడంపై ప్రధాని మోడీ క్రికెటర్లను ఆరా తీసినట్లు తెలుస్తోంది. మోడీతో భేటీ తర్వాత క్రికెటర్లు ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం బీసీసీఐ ఆధ్వర్యంలో వీరికి సన్మానం జరగనుంది. ఇప్పటికే వరల్డ్ కప్ గెలిచిన టీమ్ కు బీసీసీఐ రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది.












Click it and Unblock the Notifications