ప్రజలను క్యాష్ లెస్ చేశారు: మోడీపై రాహుల్ సెటైర్
మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కేంద్రంపై విరుచుకుపడగా, కాసేపటికే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధానిపై కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శల దాడిని పెంచారు. మంగళవారం ఉదయం మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కేంద్రంపై విరుచుకుపడగా, కాసేపటికే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.
క్యాష్ లెస్ లావాదేవీలు చేస్తామంటున్న ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయం.. ప్రజలను క్యాష్ లెస్గా మార్చారని ఎద్దేవా చేశారు. ఏటీఎం, బ్యాంకుల ముందు క్యూలలో పెద్ద(ధనికులు) వాళ్లు ఎందుకు కనబడటం లేదని ఆయన ప్రశ్నించారు.
పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని మోడీ.. సామాన్య ప్రజల జేబుకు చిల్లు పెట్టారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్లోని దాద్రిలో ర్యాలీ నిర్వహించిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ప్రధాని.. ధనికుల నుంచి నల్లడబ్బును రాబట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
కుంభకోణాలు ఎక్కువయ్యాయి
పెద్ద నోట్ల రద్దు తర్వాత కుంభకోణాలు పెరిగిపోయాయని సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి అన్నారు. ప్రధాని మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని అన్నారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని అన్నారు.
నోట్ల రద్దు తర్వాత 4లక్షల మంది కార్మికులు పని కోల్పోయారని సీతారాం ఏచూరి చెప్పారు. అమెరికాకు అనుకూలమైన విధానాలను మోడీ అవలంభిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా క్యాస్ లెస్ లావాదేవీలంటున్నారని ధ్వజమెత్తారు.