ఈ పథకం కింద లబ్ధిదారులకు గరిష్టంగా రూ. 80,000 వరకు సహాయం: ప్రధాని మోదీ
పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల శతాబ్దాల నాటి సవాళ్లను అధిగమించడంలో భారత్ ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శతాబ్దాలుగా భారత్ ప్రకృతితో మమేకమై జీవించే విశిష్టమైన జీవన విధానం, సంస్కృతిని కలిగి ఉందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ అనేది దేశ భావజాలంలోనే ఉందని, మన జీవనంలో అదొక భాగమని చెప్పారు. ఈ సాంస్కృతిక అనుభవాల ఆధారంగానే వాతావరణ మార్పుల వంటి సవాళ్లకు పరిష్కారాలను అన్వేషిస్తోన్నామని వివరించారు.
దేశ రాజధానిలో నిర్వహించిన ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు.పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ నివారణకు ప్రపంచవ్యాప్తంగా సామూహిక కార్యాచరణ అవసరమని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఉద్గారాల విడుదలలో అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాలపై తప్పుడు అంచనాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

నేటికీ భారతదేశంలో తలసరి కార్బన్ ఉద్గారాల పరిమాణం ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగానే ఉందని ప్రధాని స్పష్టం చేశారు. అదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాల తలసరి ఉద్గారాలు భారత్ కంటే ఆరు రెట్లు అధికంగా ఉందని గుర్తు చేశారు. 12 ఏళ్ల కాలంలో పర్యావరణ సంరక్షణకు సంబంధించి ప్రతి రంగంలోనూ ప్రగతి సాధించామని, ప్యారిస్ సీఓపీ 21 సదస్సులో ఇచ్చిన హామీలన్నింటినీ గడువు కంటే ముందే పూర్తి చేసిన ఏకైక జీ20 దేశంగా నిలిచామని పేర్కొన్నారు.
గతంలో రెండు గిగావాట్లుగా ఉన్న సౌర విద్యుత్ సామర్థ్యం ఇప్పుడు 160 గిగావాట్లను దాటిందని, పర్యావరణ అనుకూల సాంకేతికతలను విస్తృతం చేయడంతోనే ఇది సాధ్యపడిందని మోదీ అన్నారు. ప్రజలను పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేస్తూ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీనిద్వారా దేశంలో ఇప్పటికే 50 లక్షలకు పైగా ఇళ్లపై రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ అమర్చినట్లు వెల్లడించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున గరిష్టంగా రూ. 80,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తోన్నట్లు తెలిపారు.
వ్యవసాయదారులకు సోలార్ పంపుల పంపిణీకి ఉద్దేశించిన కుసుమ్ పథకం ద్వారా 30 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరినట్లు చెప్పారు. సౌర విద్యుత్ వినియోగం ద్వారానే దేశంలో సుమారు 20 కోట్ల టన్నుల కార్బన్ ఉద్గారాలు వాతావరణంలో కలవకుండా అడ్డుకోగలిగామని ప్రధాని మోదీ వివరించారు. పర్యావరణ సుస్థిరత కోసం ప్రారంభించిన వన్ నేషన్, వన్ గ్రిడ్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయిందని పేర్కొన్నారు.
పవన విద్యుత్ రంగంలో దేశ సామర్థ్యం గత 12 ఏళ్లల్లో మూడు రెట్లు పెరిగిందని, జల విద్యుత్ రంగం కూడా వేగంగా విస్తరిస్తోందని ప్రధాని తెలిపారు. రవాణా రంగంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, గత 12 ఏళ్లలో ఈవీల సంఖ్య దేశంలో భారీగా పెరిగిందని చెప్పారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటూనే ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చనే విషయాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications
