యుపి ఉత్సాహం: నో రెస్ట్ అంటూ మోడీ, ఇక దూకడే
మోదీ సైతం వరుసగా వివిధ రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులతో సమావేశమై విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదని, తదుపరి లక్ష్యాలు సాధించేందుకు ముందుకు సాగాలని హితవు చెప్తూ సాగుతున్నారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన తర్వాత అధికార బీజేపీ ద్విగుణీక్రుతమైన ఆనందంతో భవిష్యత్ లక్ష్యాల సాధన దిశగా ముందుకు సాగుతోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం వరుసగా వివిధ రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులతో సమావేశమై విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదని, తదుపరి లక్ష్యాలు సాధించేందుకు ముందుకు సాగాలని హితవు చెప్తూ సాగుతున్నారు.
అందులో భాగంగా గుజరాత్, రాజస్థాన్, గోవా, డామన్ డయూ లోక్సభ సభ్యులతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత లాల్ క్రుష్ణ అద్వానీ, కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.

2019 లోక్సభ ఎన్నికలకు పునాది
2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పునాది బలోపేతం చేసుకోవాలని సూచిస్తున్నారు. వచ్చేనెల 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షిస్తూ ముందుకు సాగాలని సూచనలు చేశారు.నిత్యం నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలకు ఇదే తరహా సందేశాన్నిచ్చారని ప్రధాని మోడీ సన్నిహిత వర్గాల కథనం.

గుజరాత్ తోపాటు లోక్ సభ ఎన్నికల వ్యూహంపై
ఈ సమావేశంలో పాల్గొన్న పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 2019 లోక్సభ ఎన్నికలతోపాటు పలు అంశాలు చర్చించామని వివరించారు. అలాగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ గురించి కూడా చర్చించామని తెలిపారు. ఈ ఏడాది చివరిలోగా జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాలకు 150 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని లక్ష్యం నిర్దేశించారని పార్టీ వర్గాల కథనం. పేదలు, అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం చేపట్టిన అభివ్రుద్ధి పథకాలు, కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలోనూ మారుమూల ప్రాంతాలకు ప్రభుత్వ ఫలాలు తీసుకెళ్లాలని ఎంపీలను ప్రధాని మోదీ కోరారు. ఈ సమావేశానికి సుమారు 50 మంది ఎంపీలు హాజరయ్యారని తెలుస్తున్నది.

యోగి పనితీరులో జోక్యం చేసుకోవద్దని
ఉత్తరప్రదేశ్ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ పనితీరులో జోక్యం చేసుకోరాదని ప్రధాని మోదీ నచ్చజెప్పారని తెలుస్తున్నది. ఆయన నుంచి వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించొద్దని సుతిమెత్తగానే ఆయన ఆదేశించారని సమాచారం. ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతల పరిరక్షణకు ఎటువంటి భంగం వాటిల్లనివ్వకుండా సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పూర్తి స్వేచ్ఛ నివ్వాలని నిర్ణయానికి వచ్చారు. ప్రత్యేకించి ప్రస్తుతం పని చేస్తున్న అధికారుల స్థానే తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను నియమించాలని ఒత్తిళ్లు తేవొద్దని స్పష్టం చేశారు.

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల యోచన
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయంతో ఉబ్బితబ్బిబవుతున్న బీజేపీ నాయకత్వం మోదీ హావాను సొమ్ము చేసుకునేందుకు ముందస్తుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుపాలని బీజేపీ తలపోస్తున్నట్లు సమాచారం. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఇటీవల మాట్లాడుతూ అవసరమైతే ముందస్తు ఎన్నికలకు సిద్ధమని సంకేతాలిచ్చారు. 19 ఏళ్లుగా నిరంతరాయంగా పాలన సాగిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో ‘మిషన్ 150' లక్ష్యంతో ముందుకు సాగాలని ప్రకటించింది. ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీలో బీజేపీకి 123 స్థానాలు మాత్రమే ఉన్నాయి.












Click it and Unblock the Notifications