హర్యానాలో అధికారంపై బీజేపీ ధీమా, శ్రేణులకు మోడీ, అమిత్ షా థాంక్స్
మహారాష్ట్రతోపాటు హర్యానాలో కూడా మరోసారి అధికారం కట్టబెట్టబోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమపై విశ్వాసం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మరోసారి మనోహర్ లాలా ఖట్టర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హర్యానా అసెంబ్లీలో ఏ పార్టీకి మెజార్టీ రాని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జేజేపీ, ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. దీంతో రిసార్ట్ రాజకీయాలకు తెరతీసిన సంగతి తెలిసిందే.
థాంక్స్..
ఇదివరకటి లాగే కష్టపడి పనిచేస్తామని ప్రధాని మోడీ చెప్పారు. అదే అంకితభావంతో పనిచేసే రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పారు. పార్టీ విజయం కోసం అహోరాత్రులు శ్రమించిన పార్టీ కార్యకర్తలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వ విధాన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చెప్పారని పేర్కొన్నారు. దీంతో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించి అధికారం చేపట్టేందుకు దోహదపడిందని వివరించారు.
షా అభినందనలు
మరోవైపు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్కు బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. హర్యానాలో బీజేపీ విజయం కోసం కృషిచేసిన కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్రతోపాటు హర్యానాలో కూడా బీజేపీ అధికారం చేపడుతుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్రతోపాటు హర్యానాలో అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
హర్యానాలో హంగ్
హర్యానా ప్రజలు ఏ పార్టీకి మెజార్టీ కట్టబెట్టలేదు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 46 సీట్లు సాధించిన పార్టీ అధికారం చేపట్టడం ఖాయం. కానీ అధికార బీజేపీ 40 సీట్ల వద్ద నిలిచి.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 31 సీట్లు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో వీరి మధ్య అధికారం దోబుచూలాడుతుంది.
కీ రోల్
జేజేపీ నేత దుష్యంత్ను సీఎం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసింది. దీంతో హర్యానా రాజకీయాలు రసకందాయంగా మారాయి. జేజేపీ 10 సీట్లను గెలుచుకుంది. మరోవైపు 9 స్థానాలు గెలిచిన ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. వీరు ఎవరికీ మద్దతు తెలిపితే వారు సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు జేజేపీ, మరోవైపు ఇండిపెండెంట్ల హవా కొనసాగుతుంది.