మరోసారి సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్.. సంపూర్ణ లాక్ డౌన్పై చర్చిస్తారా..?
భారత్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జూన్ 16,17 తేదీల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మార్చి 25న లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుంచి ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండటం ఇది ఆరోసారి. దేశంలో అన్ లాక్ 1.0 పరిస్థితులపై ఆయన చర్చించనున్నారు. అలాగే కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ప్రధాని మరోసారి సంపూర్ణ లాక్ డౌన్పై చర్చిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
రెండు రోజులు జరగబోయే ఈ వీడియో కాన్ఫరెన్స్ కోసం రాష్ట్రాలు రెండు స్లాట్స్గా విభజించబడుతాయి. మొదటిరోజు 21 రాష్ట్రాలు,కేంద్ర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా పరిస్థితి గురించి చర్చిస్తారు. ఇందులో పంజాబ్, అసోం, కేరళ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్ఘడ్, త్రిపుర,హిమాచల్ ప్రదేశ్, చంఢీఘర్, గోవా, మణిపూర్, నాగాలాండ్, లదాఖ్, పుదుచ్చేరి,అరుణాచల్ ప్రదేశ్,మేఘాలయ,మిజోరాం,సిక్కీం,లక్షద్వీప్,అండమాన్&నికోబార్,దాదానగర్ హవేలీ&డామన్ డయ్యూ ఉన్నాయి. మరుసటి రోజు తమిళనాడు, ఢిల్లీ,గుజరాత్, రాజస్తాన్,ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,పశ్చిమ బెంగాల్,కర్ణాటక,బీహార్,ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమవుతారు.
గడిచిన 24గంటల్లో దేశంలో అత్యధికంగా 10వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,535కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 8498కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్యలో ప్రస్తుతం భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. భారత్ కంటే ముందు అమెరికా(20,76,495 cases), బ్రెజిల్ (7,87,489) రష్యా (5,02,436) దేశాలున్నాయి.