మోడీ అమెరికా పర్యటన: నెలాఖరులో ఒబామాతో భేటీ
వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోడీ తన అమెరికా పర్యటనలో సెప్టెంబర్ 29-30 తేదీల్లో వైట్హౌస్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించడానికి, బలోపేతం చేయడానికి పలు అంశాలపై చర్చించనున్నారు.
ఈ సమావేశం రెండు రోజుల పాటు జరగడాన్ని బట్టే.. భారత్తో ద్వైపాక్షిక సంబణధాలకు అమెరికా ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్థమవుతుందని ఒబామా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒబామా-మోడీ మధ్య తొలిసారిగా జరుగుతున్న అధికారిక సమావేశానికి సంబంధించిన వివరాలతో అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడకపోయినప్పటికీ ఇరువురు నేతలు సెప్టెంబర్ 29-30 తేదీల్లో సమావేశమవుతారని అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి ఒకరు చెప్పారు.
భరత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సెప్టెంబర్ 29-30 తేదీల్లో వైట్హౌస్కు ఆహ్వానించడం కోసం అధ్యక్షుడు ఒబామా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు' అని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ చెప్పారు. ‘మా ఇరు దేశాల పౌరులు, ప్రపంచం మేలుకోసం భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం చేసిన హామీని నెరవేర్చడం కోసం మోడీతో కలిసి పని చేయడానికి ఒబామా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు' అని ఆయన చెప్పారు.
అఫ్గానిస్థాన్, సిరియా, ఇరాక్లలో ప్రస్తుత పరిణామాలతో సహా ప్రాంతీయ సమస్యలపైన కూడా వారు దృష్టిపెడతారని, సానుకూల ఫలితాలు సాధించేందుకు భాగస్వాములతో కలిసి భారత్, అమెరికాలు పని చేస్తాయని ఆయన చెప్పారు. భారత్-అమెరికా సంబంధాలకు తాము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఈ రెండు రోజులపాటు భేటీతో అర్థమవుతుందని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి కైట్లిన్ హేడెన్ అన్నారు.