ఒకే వేదికను ఉద్దేశించి..ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్: ఈ సాయంత్రమే
న్యూఢిల్లీ: ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్లోని దావోస్లో ఏర్పాటయ్యే ప్రపంచ ఆర్థిక సదస్సు.. ఇవ్వాళ ఆరంభం కానుంది. అయిదు రోజుల పాటు ఇది కొనసాగుతుంది. ఈ సదస్సును తొలిరోజును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, వ్యాక్సిన్ అభివృద్ధి, భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్లు..అంశాలపై ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది.
నిజానికి- ఈ సంవత్సరం ఎప్పట్లాగే భౌతికంగా దీన్ని నిర్వహించాలని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తొలుత నిర్ణయించింది. దీనికి ఏర్పాట్లు కూడా చేసింది. అదే సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించడంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ సదస్సును రద్దు చేసింది. గత సంవత్సరం తరహాలోనే వర్చువల్ విధానంలో నిర్వహిస్తామని డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ క్లాస్ ష్క్వాబ్ తెలిపారు.
వర్చువల్ విధానంలో అయిదు రోజుల పాటు కొనసాగుతుంది. వివిధ దేశాల అధినేతలు, ప్రధానమంత్రులు, ఆర్థిక మంత్రులు, పారిశ్రామికవేత్తలు వర్చువల్ ప్లాట్ఫామ్పైనే భేటీ అవుతారు. కాగా- ప్రధాని నరేంద్ర మోడీ తొలి రోజే ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నరు. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8:30 గంటలకు ఆయన ప్రసంగం ఉంటుంది. దేశంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల గురించి వివరించనున్నారు.
ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా, లోకల్ టు వోకల్.. వంటి అంశాలను ఆయన ప్రధానంగా తన ప్రసంగంలో ప్రస్తావిస్తారని తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ఈ రెండేళ్ల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ఎదురైన సవాళ్లు.. వాటిని ఎలా ఎదుర్కొనగలిగామనే విషయాలను మోడీ వివరిస్తారని తెలుస్తోంది. వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడంలో దేశం స్వయం సమృద్ధిని సాధించిందనే విషయాన్ని సదస్సు దృష్టికి తీసుకెళ్తారని సమాచారం.
ప్రధాని మోడీతో పాటు చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్పింగ్, జపాన్ ప్రధానమంత్రి కిషిడ ఫ్యూమియో, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సువా వాన్డెర్ లెయెన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ.. తొలి రోజు సదస్సును ఉద్దేశించి ప్రసంగిచనున్నారు. అయిదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ రతన్ టాటా వర్చువల్ విధానంలో పాల్గొననున్నారు.