"నేను శివ భక్తుడిని.. విమర్శల విషాన్ని దిగమింగుతా"
ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ అసోంలో రెండో రోజుల పాటు పర్యటించారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ తనపై అలాగే తన తల్లిపై చేస్తున్న ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తనపై విమర్శలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని అన్నారు. తాను శివ భక్తుడను అని విమర్శల విషాన్ని దిగ మింగుతానని తెలిపారు. భారత రత్న అవార్డు గ్రహీత భూపేన్ హజారికాను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని అన్నారు. అలాగే 1962లో చైనా చొరబాటు సమయంలో నెహ్రూ సర్కార్ అనేక తడబాట్లు చేసిందని వాటి వల్ల అసోం ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు అనుభవిస్తున్నారని తెలిపారు. తనను ఎవరైనా దూషించినా తాను శివుడిలా విషాన్ని దిగమింగుతాను అని.. కానీ ఈశాన్య ప్రజలు ఆరాధించే వ్యక్తిని అవమానిస్తే మాత్రం సహించేది లేదని ఆయన భావోద్వేగం వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ తొలి ప్లేస్ లో ఉందని ప్రధాని మోదీ తెలిపారు. అందుకోసం తమ ప్రభుత్వం అనేక సంస్కరణలు అమలు చేస్తోందని అన్నారు. అంతకుముందు, మంగళ్దోయ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కొత్త మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, జీఎన్ ఎం స్కూల్ తో పాటుగా బీఎస్సీ నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు గువాహటిలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఉద్దేశించిన రింగ్ రోడ్డు ప్రాజెక్టు, బ్రహ్మపుత్ర నదిపై నిర్మించనున్న కురువ- నారెంగి 2.9 కిలోమీటర్ల వంతెన పనులనూ ప్రారంభించారు.

మరోవైపు తాజాగా ప్రధాని మోదీ తల్లి ఏఐ వీడియోపై దిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఐటీ సెల్ విభాగంపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు దిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బీజేపీ దిల్లీ ఎలక్షన్ సెల్ కన్వీనర్ సంకేత్ గుప్తా ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు FIR నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఐటీ సెల్ విభాగంను ప్రధాన నిందితులుగా చేర్చారు.












Click it and Unblock the Notifications