బ్రిస్బేన్ చేరుకున్న ప్రధాని మోడీ, ఘన స్వాగతం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ చేరుకున్నారు. పదిరోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లిన మోదీ, నిన్నటిదాకా మయన్మార్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా జీ-20 సదస్సులో పాల్లొనేందుకు ఆస్ట్రేలియా చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది.
మరికాసేపట్లో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బోట్తో భేటీ కానున్నారు. ప్రధాని మోడీ ఆస్ట్రేలియాలో ఐదు రోజుల పాటు పర్యటిస్తారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రేలియాలో అధికారకంగా పర్యటిస్తున్నారు.
1986లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ పర్యటన తర్వాత భారత్ నుంచి ఎవరూ అధికారకంగా పర్యటించలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మోడీ, జీ-20 సదస్సులో పాల్గొనడంతో పాటు అక్కడి ప్రవాస భారతీయులతోనూ సమావేశం కానున్నారు.
సిడ్నీలో ఏర్పాటు చేసే బహిరంగసభలో మోడీ మాట్లాడనున్నారు. ఇలా ఆస్ట్రేలియాలో ఓ బహిరంగ సమావేశంలో మాట్లాడిన తొలి ఇతర దేశ ప్రధానిగా మోదీ రికార్డు నమోదు చేయనున్నారు.
శనివారం నుంచి ప్రారంభం కానున్న జీ20 సదస్సులో ముఖ్యంగా బ్లాక్ మనీపై ప్రధాని మోడీ మాట్లడనున్నట్లు సమాచారం. జీ20 సదస్సులో ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా సదస్సుల్లో ఆసియా, ఆఫ్రికా, యూరప్, తదితర ఖండాల దేశాలకు చెందిన సుమారు 490 మంది నేతలను మోడీ కలవనున్నారు.