నెహ్రూ రికార్డు బద్దలు కాబోయే వేళ.. మోదీ అప్రతిహత ప్రస్థానం!
క్షేత్రస్థాయి రాజకీయాల నుంచి దేశ అత్యున్నత పీఠం వరకు సాగిన ఆ ప్రస్థానం.. ఇప్పుడు నవ భారత రాజకీయ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సరికొత్త మైలురాయిని తాకబోతోంది. భారతదేశ భాగ్యవిధాతగా, అప్రతిహత ప్రజాదరణతో దూసుకుపోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో చారిత్రాత్మక రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యారు. రాబోయే జూన్ 10, 2026 నాటికి ఆయన స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల నాటి రికార్డును చెరిపివేయనున్నారు. దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన 'ఎన్నికైన' ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర పుటల్లో అగ్రభాగాన నిలవబోతున్నారు.
4,399 రోజుల అప్రతిహత ప్రస్థానం!
రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. జూన్ 10 నాటికి ప్రధాని మోదీ తన పదవీకాలంలో వరుసగా 4,399 రోజులను పూర్తి చేసుకోనున్నారు. ఇప్పటివరకు పండిట్ నెహ్రూ మూడు సార్వత్రిక ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రధానిగా 4,398 రోజుల రికార్డుతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ రికార్డును మోదీ ఇప్పుడు అధిగమిస్తున్నారు. 2014 మే 26న దేశ ప్రధానిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి.. 2019, ఆపై 2024 ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు తిరుగులేని ప్రజాదరణతో కూటమి పీఠాన్ని దక్కించుకుని నిరంతరాయంగా ఈ అత్యున్నత ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ అరుదైన జాబితాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (1966 జనవరి 24 - 1977 మార్చి 24 వరకు వరుసగా 4,077 రోజులు) మూడవ స్థానంలో నిలిచారు.

ముఖ్యమంత్రిగా.. ప్రధానమంత్రిగా..
నరేంద్ర మోదీ సాధించిన ఈ విజయం కేవలం ప్రధాని పదవికే పరిమితం కాలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 నుంచి 2014 వరకు సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవం, ఆ తర్వాత దేశ ప్రధానిగా చేపట్టిన సంస్కరణలు ఆయనను ప్రపంచ స్థాయి నేతగా నిలబెట్టాయి. ఒక ప్రభుత్వ అధిపతిగా, ప్రధానమంత్రి పదవుల్లో కలిపి మోదీ ఇప్పటివరకు 8,930 రోజులకు పైగా సేవలందించి రికార్డు సృష్టించారు.
1947 నుంచి 1964 వరకు ప్రధానిగా చేసిన పండిట్ నెహ్రూ మొత్తం (తాత్కాలిక కాలంతో కలిపి) 6,130 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. సీఎం హోదాలో పనిచేయని నెహ్రూకు భిన్నంగా, మోదీ రెండు దశాబ్దాలకు పైగా నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ రికార్డులు తిరగరాస్తున్నారు.
రికార్డుల రారాజు 'మోదీ'
దేశవ్యాప్తంగా అభివృద్ధి-సుపరిపాలన అనే నినాదంతో దూసుకుపోతున్న నరేంద్ర మోదీ, ఈ ఏడాది మార్చిలోనే భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును కూడా అధిగమించి టాప్లోకి దూసుకెళ్లారు. దేశ సరిహద్దుల రక్షణ నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు, ఆర్థిక సంస్కరణల నుంచి ప్రపంచ దేశాల ముందు భారత ఖ్యాతిని పెంచడం వరకు మోదీ చూపిన చొరవ అసాధారణం.
జూన్ 10న నమోదు కాబోయే ఈ సరికొత్త మైలురాయి కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు.. మోదీపై దేశ ప్రజలు ఉంచిన అచంచలమైన నమ్మకానికి, ఆయన తిరుగులేని నాయకత్వానికి దక్కిన చారిత్రాత్మక నిదర్శనం అని రాజకీయ వర్గాలు కొనియాడుతున్నాయి.














Click it and Unblock the Notifications