మోడీ సిఫార్సుల్ని లెక్క చేయరు: సోదరుడు, నేతాజీ పైల్ తెరుస్తారు!
హైదరాబాద్/బెర్లిన్: ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలనే కుటుంబంగా భావిస్తారని, ఆయన సిఫార్సులను లెక్కచేయరని, మంచిదని భావిస్తే చేస్తారని ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోడీ మంగళవారం అన్నారు. మొన్నటి వరకు దేశంలో ఇంటివాళ్లు చెప్పిందే జరిగేదని, కానీ ప్రస్తుత ప్రధాని తాను మంచిదని భావించిందే చేస్తారన్నారు. ప్రహ్లాద్ మోడీ అహ్మదాబాదులో రేషన్ డీలర్.
ఆయన గుజరాత్ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా, అఖిల భారత సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన హైదరాబాదుకు వచ్చారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. రేషన్ డీలర్లకు మంచి రోజులు రానున్నాయని ఆయన చెప్పారు.
నేతాజీపై అనుమానాలు నివృత్తి చేస్తాం: మోడీ
సుభాష్ చంద్రబోస్ మునిమనుమడు సూర్యకుమార్ బోస్తో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన విషయం తెలిసిందే. బెర్లిన్ పర్యటనలో ఉన్న మోడీతో సోమవారం రాత్రి సూర్య సమావేశమయ్యారు. నేతాజీ అదృశ్యంపై నెలకొన్న అనుమానాల నివృత్తి చేస్తామని మోడీ ఈ సందర్భంగా సూర్య కుమార్ బోస్కు హామీ ఇచ్చారు.
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలొడ్డిన నేతాజీ, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లపై నిఘా ఉందంటూ వార్తలొచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి విచారణ జరిపి రహస్య ఫైళ్లను బహిర్గతం చేస్తామని కేంద్రం ప్రకటించింది.
ప్రధాని మోడీకి ఇక్కడి భారత్ రాయబారి విజయ్ గోఖలే ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరైన బోస్ మునిమనుమడు సూర్యకుమార్ బోస్ అనంతరం ప్రధానితో సమావేశమయ్యారు. నేతాజీ కుటుంబంపై నెహ్రూ ప్రభుత్వం నిఘా ఉంచిందన్న వార్తలు తమను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని సూర్య బోస్ స్పష్టం చేశారు.