'రాహుల్ స్పూర్తితోనే మోడీ మన్ కీ బాత్’, ఢిల్లీలో ఆప్ 100 రోజులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన్ కీ బాత్' కార్యక్రమం కాపీ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రీటా బహుగుణ విమర్శించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 2004లో యువతతో మాట్లాడిన సంభాషణ నుంచే ప్రధాని మోడీ దానిని స్పూర్తిగా తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు.
2004లో రాహుల్ గాంధీ యువతతో మమేకం అయ్యేందుకు నిర్వహించిన ‘యూత్ డైలాగ్' కార్యక్రమంతో ప్రభావితుడయ్యే ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్' రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆమె అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గుజరాత్ సీఎంగా ఉన్నపుడు మోడీ ఇలాంటి పనులు చేయలేదని అన్నారు.
మోడీ నిర్వహిస్తోన్న ‘మన్ కీ బాత్' కార్యక్రమంతో ఎలాంటి ప్రయోజనం లేదని, ప్రజలను ప్రభావితం చేయడంలో విఫలమైందని అన్నారు. ఇక విద్యావిధానంపై ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాన్ని తప్పుబడుతూ, మంత్రి స్మృతి ఇరానీ ఎడ్యుకేషన్ నిర్మాణాన్నే చెడగొడుతుందని మండిపడ్డారు.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా విద్యా విధానాన్ని నాశనం చేయడమే కాకుండా, విద్యా సంస్ధల పేరు చెడగొడుతందని, ఆర్ఎస్ఎస్ భావజాలలను వాటిపై రుద్దుతుందని ఆరోపించారు.
ఢిల్లీలో 100 రోజులు పూర్తి చేసుకున్న ఆప్ ప్రభుత్వం
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఆదివారంతో వంద రోజులు పూర్తైంది. ఈ సందర్భంగా ఆ పార్టీ సమావేశం నిర్వహించనుంది. వంద రోజుల పాలనలో ఆప్ ప్రభుత్వం సాధించిన ప్రగతిని పార్టీ వర్గాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఢిల్లీ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా డిప్యూటీ సీఎం మనీష్ శిషోడియా మాట్లాడిుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని అన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజుల పాటు అత్యవసర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వ అధికారుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్తో జరిగిన వివాదంపై చర్చించనున్నారు.