అత్యాచారం కంటే మంత్రి గారి కుక్క పిల్లే ఎక్కువ..!
జైపూర్: జైపూర్ సిటీలోని వైశాలి నగర్లో జరిగిన దోపిడీ, అత్యాచార సంఘటనల కంటే... మంత్రిగారి కుక్క తప్పిపోయిందన్న ఫిర్యాదు అక్కడి పోలీసులకు మరింత తలనొప్పిగా మారింది. రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్ కు చెందిన 'చార్లీ' అనే లాబ్రడార్ జాతి కుక్కపిల్ల శనివారం రాత్రి నుంచి కనిపించడంలేదట.
దీంతో, ఆ కుక్కకి సంరక్షకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి సోడాలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మంత్రి గారి కుక్క పిల్ల కావడంతో పోలీసు అధికారుల్లో హాడావుడి మొదలైంది. ఉన్నతాధికారులు తమ కింది వారికి ఆదేశాలు జారీ చేశారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కుక్క ఆచూకీ కనిపెట్టాలంటూ. దీంతో ఆదివారం మొత్తం పోలీసు బృందాలు ఇదే పనిలో మునిగిపోయాయని సమాచారం.
దీనిపై ఓ కరపత్రాన్ని కూడా ముద్రించారు. ఈ కుక్క పిల్ల వయసు ఐదు నెలలు. కుక్క ఆచూకీ చెబితే రూ.10,000 రివార్డు అంటూ... ఈ వేటలో ప్రజలనూ భాగస్వాములను చేసే ప్రయత్నం చేశారు.
ఓ వ్యక్తి ఈ ఉదయం సదరు కుక్కను తీసుకువచ్చి మంత్రిగారి ఇంట్లో అప్పగించాడు. ఆదివారం నాడు తాను మార్నింగ్ వాక్ కు వెళుతుండగా, ఈ కుక్క కనిపించిందని తెలిపాడు. ఆ వ్యక్తి న్యూస్ పేపర్లో చూసి, ఈ శునకం మంత్రిగారిదని తెలుసుకున్నాడట. కుక్క దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి అర్చనా శర్మ మాట్లాడుతూ, వైశాలి నగర్ లో ఓ కుటుంబం దారుణ హింసకు గురైతే పట్టించుకోకుండా, పోలీసులు మంత్రిగారి కుక్క కోసం వెతకడం అన్యాయమని విమర్శించారు. పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.