"ఆ కీచకులను కటకటాల వెనక్కి పంపాల్సిందే": ట్విటర్ లో కేంద్ర హోంశాఖ మంత్రి కిరణ్ రిజిజు
బెంగళూరులో కీచక పర్వం ఉదంతంపై కేంద్ర హోంశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విటర్ లో స్పందిస్తూ వారిని కటకటాల వెనక్కి పంపాల్సిందేనన్నారు.
బెంగళూరు: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బెంగళూరులో కీచక పర్వం ఉదంతంపై కేంద్రం స్పందించింది. మహిళలపై జరిగిన వేధింపుల గురించి కేంద్ర హోంశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విటర్ లో స్పందించారు.
"కర్ణాటక హోంశాఖ మంత్రి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను ఖండిస్తున్నా.. నిందితులను గుర్తించి కటకటాల వెనక్కి పంపించాల్సిందే.." అని అయన పేర్కొన్నారు. ఈ ఘటనలపై చరిత్రకారుడు రామచంద్ర గుహా స్పందిస్తూ కర్ణాటక హోం మంత్రి వ్యాఖ్యలు వారి చెత్త పాలనకు నిదర్సనమని... దుస్తులు, వేధింపులపై ఆయన వ్యాఖ్యలు హేయమైనవని పేర్కొన్నారు.
డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఆకతాయి మూకలు విజృంభించి బెంగళూరు నగర వీధుల్లో మహిళలను వేధింపులకు గురిచేసిన వార్తలు వెలువడడంతో వాటిపై ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి స్పందిస్తూ .. ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా మహిళలు పాశ్చాత్య దుస్తులు ధరించడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. తాము ఇలాంటి ఘటనలను అడ్డుకునేందుకు భారీగా పోలీసులను కూడా నియమించామని, పోలీసుల తరుపున క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానించారు. మరోవైపు ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.