స్మగ్లింగ్ దందాలో సీఎం -సర్కారీ ఆస్తుల అమ్మకం -ప్రశాంత కేరళలో రాజకీయ హింస: పినరయిపై ప్రియాంక ఫైర్
ప్రశాంతతకు నిలయంగా ఉండే కేరళలో ఇటీవల రాజకీయ హింస పేట్రేగుతోందని, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) విధానల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కేరళలో పర్యటిస్తోన్న ఆమె బుధవారం చాలకూడి, కరునాగప్పల్లి, కట్టకడ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మాట్లాడారు.
పాల్గొన్న అన్ని సభల్లోనూ అధికార ఎల్డీఎఫ్ కూటమిపై, ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై ప్రియాంక తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. కేరళలో ఎల్డీఎఫ్ పాలనలో పెరిగిన హింసను, ఉద్రిక్తతలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందన్న ఆమె.. అందుకోసం శాంతి, ద్వేషపూరిత శాఖను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుందేమోనని ప్రతిపాదించారు.

కేరళ ప్రజలు నిజమైన బంగారం లాంటి వారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం బంగారం స్మగ్లింగ్ లో నిమగ్నమై ఉన్నారని ప్రియాంక ఆరోపించారు. కేరళలో లెఫ్ట్ ప్రభుత్వం పచ్చి కార్పొరేట్ విధానాలను అనుసరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను బడా బాబులకు అమ్మడమే లక్ష్యంగా పని చేస్తున్నదని విమర్శించారు. ద్వేశ రాజకీయాలు కావాలో, ఉజ్వల భవిష్యత్తు కావాలో తేల్చుకోవాల్సింది ప్రజలేనన్నారు.
''ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ముందు మూడు రకాల పొలిటికల్ ఆప్షన్లున్నాయి. ఒకటి, కుంభకోణాలు, హింస రాజకీయాలు చేసే సీపీఎం. రెండోది ద్వేషం, విభజన సృష్టించే బీజేపీ. మూడోది కేరళ ఉజ్జ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేసే కాంగ్రెస్ పార్టీ. ఈ మూడింటిలో దేన్ని ఎంచుకోవాలో ప్రజలే నిర్ణయించుకోవాలి'' అని ప్రియాంక అన్నారు. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనున్నాయి.












Click it and Unblock the Notifications