త్రిశూలం, ఉదయించే సూర్యుడు..: ఈసీ షాకివ్వడంతో పార్టీ గుర్తులపై ఉద్ధవ్ థాక్రే కీలక భేటీ
ముంబై: శివసేన పార్టీ 'విల్లు-బాణం' గుర్తు కోసం పోరాటం చేస్తున్న మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు, సీఎం ఏక్నాథ్ వర్గాలకు ఎన్నికల సంఘం షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇరువర్గాల మధ్య విభేదాల నేపథ్యంలో పార్టీ చిహ్నాన్ని ఏ వర్గానికీ కేటాయించకుండా తాత్కాలికంగా స్తంభింపజేసింది.
ఈ నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే ప్రత్యామ్నాయాలపై వైపు చూస్తున్నారు. త్రిశూలం, ఉదయించే సూర్యుడు, మషాల్ గుర్తులను ఉద్ధవ్ థాక్రే పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం సాయంత్రం 7 గంటలకు సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ భేటీలో శివసేన నేతలు ఖరారు చేయాల్సిన చిహ్నాలపై చర్చిస్తారు.
అక్టోబరు 1, 1989న విల్లు, బాణం గుర్తును నమోదు చేయడానికి ముందు సేన కొబ్బరి చెట్టు, రైల్వే ఇంజిన్, కత్తి-డాలు, మషాల్, కప్పు, సాసర్ వంటి చిహ్నాలను ఉపయోగించింది. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల కోసం గుర్తును ఎంపిక చేసే పనిలో పడ్డారు ఉద్ధవ్ వర్గం నేతలు.
ఉద్ధవ్ క్యాంపు నాయకుడు ఎమ్మెల్యే భాస్కర్ జాదవ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. "రాబోయే ఉప ఎన్నికల గుర్తుల ఎంపికపై ఆదివారం సుదీర్ఘ సమావేశం జరిగింది. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలని అభ్యర్థించారు. అంతిమంగా, మాకు రేపటి వరకు సమయం ఉంది. ఉద్ధవ్ థాక్రే ఒక ఎంపిక కోసం చూస్తున్నారు. రేపటిలోగా ఆప్షన్ల కోసం దరఖాస్తును సమర్పిస్తారు అని తెలిపారు.
అదేవిధంగా, పార్టీలోని సూచనల మేరకు శివసేన బాలాసాహెబ్ థాక్రే, శివసేన ఉద్ధవ్ థాక్రే, శివసేన ప్రబోధన్ థాక్రే పేర్లను పార్టీ కోసం పరిశీలిస్తున్నారు.
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన శనివారం ఈసీ ఉత్తర్వులను అన్యాయంగా అభివర్ణించింది. ఈసీ ఆదేశాల తర్వాత శివసేన నేత, మాజీ మంత్రి ఆదిత్య థాక్రే శనివారం తిరుగుబాటు సేన నేతల(ఏక్నాథ్ షిండే వర్గం)పై విరుచుకుపడ్డారు.