యూపీలో రెండో దశ, గోవా, ఉత్తరాఖండ్ అసెంబ్లీల అన్ని స్థానాలకు పోలింగ్ ప్రారంభం: మోడీ పిలుపు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండో దశ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఇక మరో రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో మొత్తం అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఈ ఉదయం పోలింగ్ షురూ అయ్యింది. ఉదయం నుంచే ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.
మూడు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. ఈరోజు ఓటు వేయడానికి అర్హులైన వారందరూ రికార్డు సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా కోరారు.
ఉత్తరప్రదేశ్లో రెండో దశ పోలింగ్ 55 స్థానాలకు
రోహిల్ఖండ్ ప్రాంతంలోని కొన్ని సహా తొమ్మిది జిల్లాల్లోని 55 స్థానాలకు సోమవారం ఉత్తరప్రదేశ్లో రెండవ దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇందులో సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ ఆజం ఖాన్, రాష్ట్ర ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సహరాన్పూర్, బిజ్నోర్, మొరాదాబాద్, సంభాల్, రాంపూర్, అమ్రోహా, బుదౌన్, బరేలీ, షాజహాన్పూర్లలో విస్తరించి ఉన్న స్థానాలతో ఈ దశలో 586 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని లక్నోలోని ఎన్నికల కార్యాలయం తెలిపింది. ఈ దశలో ఎన్నికలు జరగతున్న 55 స్థానాల్లో 2017లో బీజేపీ 38 స్థానాల్లో గెలుపొందగా, సమాజ్వాదీ పార్టీ 15, కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. ఎస్పీ గెలుచుకున్న 15 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులు 10 స్థానాల్లో విజయం సాధించారు.

ఉత్తరాఖండ్లో 70 స్థానాలకు 632 మంది అభ్యర్థుల పోటీ
సోమవారం ఉత్తరాఖండ్లో 632 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేందుకు 81 లక్షల మంది ఓటర్లు సిద్ధమయ్యారు. 2000లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది ఐదవ అసెంబ్లీ ఎన్నికలు కావడం గమనార్హం. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 70 అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఎన్నికలలో భవితవ్యం నిర్ణయించబడే కొందరు ముఖ్యమైన అభ్యర్థులలో
ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఆయన కేబినెట్ సహచరులు సత్పాల్ మహరాజ్, సుబోధ్ ఉనియాల్, అరవింద్ పాండే, ధన్ సింగ్ రావత్, రేఖా ఆర్య, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మదన్ కౌశిక్ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్, మాజీ మంత్రి యశ్పాల్ ఆర్య, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గణేష్ గోడియాల్, నాల్గవ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ప్రీతమ్ సింగ్ పోటీలో కాంగ్రెస్ నుంచి ఉన్న ప్రముఖులు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రచారాలపై ఆంక్షలున్న క్రమంలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు పరిమిత ర్యాలీలు నిర్వహించారు.
గోవాలో 40 స్థానాలకు ఒకే దశలో పోలింగ్
సోమవారం ఉదయం గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. గోవా అసెంబ్లీకి 40 మంది సభ్యుల బలం ఉంది, అందులో బీజేపీకి ప్రస్తుతం 17 మంది శాసనసభ్యులు ఉన్నారు. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ)కి చెందిన విజయ్ సర్దేశాయ్, ముగ్గురు స్వతంత్రుల మద్దతు బీజేపీకి ఉంది. జీఎఫ్పి, ఎంజీపీలకు ఒక్కొక్కరు ముగ్గురు ఎమ్మెల్యేలు, మరోవైపు కాంగ్రెస్కు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
గోవాలో వివిధ రాజకీయ పార్టీల నుంచి మొత్తం 301 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనతో పాటు అధికార బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రధాన పోటీదారులుగా నిలిచాయి.












Click it and Unblock the Notifications