ఫొణి టెర్రర్ : ప్రచండ గాలులు, కుండపోత వర్షం, పునరావాస కేంద్రాలకు తీరప్రాంత ప్రజలు
న్యూఢిల్లీ : ప్రచండ ఫొణి సూపర్ సైక్లోన్గా మారి తీరం వైపు దూసుకొస్తోంది. విశాఖపట్టణానికి తూర్పు ఆగ్నేయ దిశగా 154 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. దీని చుట్టూ 200 కిలోమీటర్ల వేగంత ప్రచండ గాలులు వీస్తున్నాయని విశాఖ వాతావరణ అధికారులు తెలిపారు. రేపు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య ఒడిశాలోని గోపాల్ పూర్-చాంద్ బల్ వద్ద పూరీకి సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
195 కి.మీ వేగంతో గాలులు ..
తీరానికి తుఫాన్ దగ్గర వచ్చే సమయంలో గంటకు 195 కిలోమీటర్ల వేగంతో ... తీరం దాటే సమయంలో 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అధికారులు చెప్తున్నారు. ఏపీలో శ్రీకాకులం జిల్లాపై ఫొణి తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కుండపోత వర్షాలు పడే ఛాన్స్ ఉండంతో .. ఒడిశా, ఏపీ తీరప్రాంతాల్లోని 12 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి భోజన సదుపాయాన్ని కల్పించారు.
పంటలకు ఆపార నష్టం ..?
ఈశాన్య దిశగా తుఫాను కదిలే సమయంలో అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఒడిశా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తీరం వెంబడి 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ ప్రచండ గాలులతో ఉత్తర కోస్తాలో మామిడి, అరటి, జీడి పంటలకు నష్టం వాటిల్లుతోంది. ఒడిశాలోని గోపాల్పూర్ తీరంలో పదో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
విమాన సర్వీసులు కూడా రద్దు
తుఫాన్ ప్రభావంతో రైళ్లతోపాటు పలు విమానాలను కూడా రద్దు చేశారు. గో ఎయిర్ విమానయాన సంస్థ రేపు భువనేశ్వర్ నుంచి వెళ్లాల్సిన విమానాలను రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. గురువారమే ఇండిగో సంస్థ విశాఖ నుంచి వెళ్లే 11 విమాన సర్వీసులను రద్దుచేసింది. మరోవైపు 89 రైళ్ల రాకపోకలను పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వే ప్రకటించింది.
మోదీ సమీక్ష
తుఫానుపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. తాగునీరు, విద్యుత్, టెలికం పునరుద్ధరణ పనుల్లో ఎన్డీఆర్ఎఫ్, సైనికుల సాయం, తదితర అంశాలపై చర్చించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో అవసరమైన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు.