ముగ్గురు కుమార్తెలను అగ్నికి ఆహుతి చేసిన తల్లి
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబంలోని నలుగురు సజీవదహనం అయ్యారు. కుటుంబ సమస్యల కారణంగా ఒక మహిళ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కారణంగా ముగ్గురు పిల్లలు జీవితాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.
జన్మనిచ్చిన తల్లి చేతిలో ఆ ముగ్గురి ప్రాణాలు గాలిలో కలసిపోయిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని గ్యాన్పూర్ ప్రాంతంలోని ఖమియాపూర్ గ్రామంలో పూనం పాండే (30) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఈమెకు గుడియా (6), మిన్ని (4), రుహి (8 నెలలు) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
చాలా కాలం నుండి కుటుంబ సమస్యలతో పూనం పాండే విసిగిపోయింది. భర్త పట్టించుకోకపోవడంతో కుటుంబం గడవడం భారం అయ్యింది. ముగ్గురూ ఆడపిల్లలు కావడంతో బ్రతకలేం అని భావించింది. చివరికి కఠిన నిర్ణయం తీసుకునింది.
శుక్రవారం సాయంత్రం ఇంటిలో ముగ్గురు కుమార్తెల మీద కిరోసిన్ పోసి నిప్పటించింది. తరువాత పూనం పాండే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గ్రామస్తులు తల్లి బిడ్డలను రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని జిల్లా ఎస్పీ అనీల్ కుమార్ రాయ్ అన్నారు. తను ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు అనాథలు అవుతారని భావించి బిడ్డలను హత్య చేసి ఉంటుందని అంటున్నారు.