బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ కమెడియన్...బయటపడుతున్న మరికొంతమంది తారల పేర్లు..
బాలీవుడ్లో బెట్టింగ్ యాప్ కేసు కలకలం సృష్టిస్తోంది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో స్టార్ హీరో రణబీర్ కపూర్కు ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే, ఇప్పుడు తాజాగా మరికొంతమంది తారల పేర్లు బయటికొస్తున్నాయి. ఇప్పుడు మరికొందరు బాలీవుడ్ తారలకు సమన్లు అందాయని సమాచారం. అందులో ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా మరికొందరు తారల పేర్లు ముందుకు వచ్చాయి. అందులో, నటి హుమా ఖురేషి, హీనా ఖాన్ అలాగే శ్రద్ధా కపూర్ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
14 మంది తారల పేర్లు : అయితే, ఇప్పటికే అక్టోబర్ 4న స్టార్ హీరో రణబీర్ కపూర్కు ఈడీ సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 6న రణబీర్ కపూర్ను విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే రణబీర్ కపూర్ ఈడీని రెండు వారాల సమయం అడిగారు. ఇప్పుడు తాజాగా, కపిల్ శర్మ, హుమా ఖురేషీ, శ్రద్ధా కపూర్, హీనా ఖాన్లకు ఈడీ సమన్లు పంపినట్లు తెలుస్తోంది. ఇంకా ఇందులో 14 మంది బాలీవుడ్ తారలు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అందులో సన్నీలియోన్, కృష్ణ అభిషేక్, పుల్కిత్ సామ్రాట్ వంటివారు ఉన్నారు. అయితే ఆ 14 మంది తారల్లో కపిల్, హుమా, శ్రద్ధా, హీనా పేర్లు లేకపోవడం విశేషం. అయితే ఇప్పుడు ఈ నలుగురి తారలకు కూడా సమన్లు పంపించారు ఈడీ అధికారులు.

ఇది ఒక ఆన్లైన్ బెట్టింగ్ ఫ్లాట్ఫామ్ : మహాదేవ్ బుక్ అనేది ఒక ఆన్లైన్ బెట్టింగ్ ఫ్లాట్ఫామ్. దీని ద్వారా అక్రమంగా మనీలాండరింగ్ జరుగుతుందనే ఆరోపణలు వచ్చాయి. దాంతో ఈడీ అధికారులు వీటిపైనా దర్యాప్తు ప్రారంభించారు. ఈ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్. ఇతను ఫిబ్రవరి 2023లో దుబాయ్లో అత్యంత ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి సుమారుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దుబాయ్లో జరిగిన చంద్రకర్ వివాహానికి బాలీవుడ్ తారలతో పాటు పాకిస్థాన్ గాయకులు అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్ కూడా హాజరయినట్లు తెలుస్తోంది. ఇప్పటికి ఈ బెట్టింగ్కు సంబధించి ఈడీ జరిపిన దర్యాప్తులో సుమారు ఐదువేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తెలుస్తోంది.
యాప్ ప్రమోటర్లు సౌరభ్, రవి ఉప్పల్ భారతదేశంలో నాలుగువేల మంది ఆపరేటర్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఆపరేటర్కు సుమారు 200 మంది కస్టమర్లు ఉన్నారని సమాచారం. అంటే, ఈ లెక్కన రోజుకు 200 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని అర్థం. ఈ యాప్ ప్రమోటర్లు సౌరభ్, రవి ఉప్పల్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ నటులు ఆన్లైన్ ఈ యాప్ను ప్రచారం చేసి, ప్రమోటర్ల నుంచి బారీ మొత్తంలో డబ్బు అందుకున్నట్లు ఈడీ అభియోగిస్తుంది. త్వరలోనే ఈ కేసులో మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని ఈడీ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications