హైడ్రామాలో నెగ్గింది పన్నీరేనా?, మరింత స్ట్రాంగ్గా శశికళ 'క్యాంప్ పాలిటిక్స్'
ఆఖరికి టీవీ, పేపర్ వంటివి కూడా ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకుండా చేసినట్టు సమాచారం.
చెన్నై: రెండు రోజుల పాటు కొనసాగిన హైడ్రామాకు సినిమా క్లైమాక్స్ ను తలపించేలా 'గవర్నర్తో భేటీ'.. ఆ తర్వాత పన్నీర్ సెల్వం ముఖంలో ఒక ధీమా.. శశికళ ముఖంలో ఏదో నిరుత్సాహం.. మొత్తం మీద ఇన్నాళ్లు సౌమ్యుడిగా ముద్రపడ్డ పన్నీర్.. అసలైన సమయంలో తన రాజకీయాలకు పదును పెట్టారు.
ఎత్తుకు పైఎత్తులతో శశికళ వ్యూహాలను చిత్తు చేస్తూ ముందుకు సాగారు. గవర్నర్ తో భేటీ అనంతరం పన్నీర్ లో ధీమా మరింతగా పెరిగినట్టు కనిపిస్తుంది. మరోవైపు శశికళ ఆశలు రోజురోజుకు ఆవిరైపోతున్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో రెండు రోజుల హైడ్రామాలో పన్నీరే నెగ్గారా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చిన్నమ్మ ముఖం ఎందుకు చాటేసింది?
గవర్నర్ తో భేటీ తర్వాత చిన్నమ్మ శశికళ మీడియాకు ముఖం చాటేయడంతో.. జరుగుతున్న పరిణామాలు ఆమెకు ప్రతికూలంగా మారుతున్నాయా? అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అంతకుముందు గవర్న్ తో పన్నీర్ కొద్దిసేపు మాత్రమే భేటీ అయినా.. ఆయనలో 'సీఎం' తానేనన్న ధీమా వ్యక్తమైంది.
సంతకాలపై పన్నీర్ అనుమానం..
కాగా, గవర్నర్ తో భేటీ సందర్బంగా బల నిరూపణకు తనకు ఐదు రోజులు గడువు కావాల్సిందిగా పన్నీర్ కోరినట్టు తెలుస్తోంది. అదే సమయంలో తనకు 130మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని చెబుతోన్న శశికళ వ్యాఖ్యల పట్ల పన్నీర్ అనుమానం వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు.
ఆమె వద్ద ఉన్న ఎమ్మెల్యేల సంతకాల్లో ఫోర్జరీ జరిగినట్టుగా పన్నీర్ గవర్నర్ తో అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
శశికళతో అదే చెప్పిన గవర్నర్:
పన్నీర్తో భేటీ అనంతరం శశికళ గవర్నర్తో భేటీ అవగా.. పన్నీర్ వ్యక్తం చేసిన అనుమానాలను శశికళతో గవర్నర్ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్ కు శశికళ అందివ్వగా.. ఆ సంతకాలను ధ్రువీకరించుకోవడం కోసం కొంత గడువు కావాల్సిందిగా గవర్నర్ కోరినట్టుగా సమాచారం.
స్ట్రాంగ్ క్యాంపు పాలిటిక్స్:
పన్నీర్ వైపు సానుకూలత పెరుగుతున్న నేపథ్యంలో.. శశికళ తన క్యాంప్ పాలిటిక్స్ ను మరింత పటిష్టం చేస్తున్నారు. 30మంది ఎమ్మెల్యేల చొప్పున నాలుగు ఎమ్మెల్యేల బృందాలను నాలుగు రిసార్టుల్లో పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఎమ్మెల్యేలు అక్కడినుంచి జారిపోకుండా ఒక్కో ఎమ్మెల్యేకు ఇద్దరు చొప్పున బాడీ గార్డులను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.ఆఖరికి టీవీ, పేపర్ వంటివి కూడా ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకుండా చేసినట్టు సమాచారం.
చెన్నైకి 70కిమీ దూరంలో ఉన్న గోల్డెన్ బే రిసార్టుతో పాటు మరో నాలుగు రిసార్టుల్లో ఈ క్యాంపు రాజకీయాలు నడుస్తున్నట్టుగా మీడియా కథనాలు వస్తున్నాయి.
ఆందోళనపై పోయెస్ గార్డెన్ వర్గాల వివరణ:
ఎమ్మెల్యేల సెల్ ఫోన్స్ సైతం స్వాధీనం చేసుకుని వాటిని స్విచాఫ్ చేయడంతో.. వారి కుటుంబ సభ్యులు ఆందోళనలు చెందుతోన్న పరిస్థితి. ఎమ్మెల్యేల నిర్బంధంపై హైకోర్టులోను పిటిషన్ దాఖలైంది.
దీనిపై స్పందించిన పోయెస్ గార్డెన్ వర్గాలు.. పార్టీ ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యుల లాంటివారని, అలాంటి వారిని క్షేమంగా చూసుకోవడం తమ బాధ్యత అని పేర్కొనట్టుగా తెలుస్తోంది.
అసలు పన్నీర్ వైపు ఎంతమంది?
ఇప్పటిదాకా వస్తున్న కథనాల ప్రకారం పన్నీర్ వెనక ఉన్నది కేవలం ఐదారుగురు ఎమ్మెల్యేలు మాత్రమే. మరో 12మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని పన్నీర్ చెబుతున్నారు.
అలాగే శశికళ నిర్బంధించిన 130మంది ఎమ్మెల్యేల్లో తనకు మద్దతుదారులు ఉన్నారని, అందుకే వారిని నిర్బంధం నుంచి బయటకు తీసుకురావాలని పన్నీర్ వాదిస్తున్నారు.
పన్నీర్-శశికళ మధ్య సాగుతున్న ఈ వార్ లో అసలు విజయం ఎవరిదనేది తేలాలంటే.. మరో రెండు మూడు రోజులు వేచి చూడక తప్పని పరిస్థితి.