పేదరికం: తనను తానే ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టుకున్న యువతి
అహ్మదాబాద్: పేదరికం ఓ యువతిని తనను తాను అమ్మకానికి పెట్టుకునేలా చేసింది. ఈ బాధాకరమైన సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. కడు పేదరికం, వృద్ధులైన తల్లిదండ్రులు, రోగాలు.. ఇవన్నింటి కారణంగా వడోదరకు చెందిన యువతి తనను తాను ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టుకున్నారు.
మరో విషయమేమంటే ఆమె మాజీ మోడల్, సోషల్ వర్కర్. ఆమె ఆంగ్ల మీడియా జీతో మాట్లాడుతూ.. తన కుటుంబ పరిస్థితులు తనను ఇలా చేసేలా చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పేరు చాందినీ రాజ్గౌర్.
తన తల్లి చాలాకాలంగా పెరాలసిస్తో బాధపడుతోందని, తన కుటుంబాన్ని పోషించే తన తండ్రి ఇటీవలే ప్రమాదానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబం కోసం తాను ఏం చేసే పరిస్థితుల్లో లేనని, తాను సహాయం అడిగేందుకు కూడా తమకు ఎవరు లేరని తెలిపారు.
దీంతో తాను తనను తాను అమ్మేసుకోవాలనుకున్నట్లు చెప్పారు. కాగా, ఆమె ఫేస్బుక్లో తనను తాను అమ్ముకునేందుకు పెట్టుకున్న తర్వాత చాలామంది తనకు ఫోన్ చేశారని చెప్పారు. కాగా, ఈ విషయం తెలిసిన గుజరాత్ స్టేట్ కమిషన్ ఫర్ వుమెన్ లీలాబెన్ అంకోలియా స్పందించారు. బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే, సివిల్ హాస్పిటల్స్ ఆమె తల్లిదండ్రులను చికిత్స అందించేందుకు ముందుకు వచ్చాయి.