నోరు జారింది..వేటు పడింది: గాడ్సేను పొగడటంతో ఆ పదవి కోల్పోయిన ప్రగ్యా ఠాకూర్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఎంపీ సాద్వీ ప్రగ్యాసింగ్ మరోసారి బీజేపీకి తలనొప్పిగా మారారు. ఆమె మళ్లీ తన నోటికి పనిచెప్పడంతో ఈ సారి ప్రభుత్వం సీరియస్ అయినట్లు సమాచారం. లోక్సభలో మాట్లాడుతూ జాతిపిత గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే గొప్పవాడంటూ నిండు సభలో చెప్పడంతో వివాదం మొదలైంది. ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ప్రగ్యాసింగ్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రగ్యా ఠాకూర్ను డిఫెన్స్ ప్యానెల్లో సభ్యురాలిగా తొలగిస్తూ ఉత్తర్వలు ఇచ్చింది ప్రభుత్వం. ఎనిమిది రోజుల క్రితమే ఆమె డిఫెన్స్ ప్యానెల్లో సభ్యురాలిగా ఎంపికయ్యారు. అంతేకాదు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు కూడా ఆమె హాజరుకాకుండా వేటు వేశారు.
రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీలో ప్రగ్యా సింగ్ ఠాకూర్
నాథూరాం గాడ్సేను పొగుడుతూ వ్యాఖ్యలు చేసిన ప్రగ్యా ఠాకూర్పై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సీరియస్ అయ్యారు. బీజేపీ అలాంటి వ్యాఖ్యలను సమర్థించదని స్పష్టం చేశారు. ఇక బీజేపీ క్రమశిక్షణా కమిటీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. భోపాల్ నుంచి ఆమె ఎంపీగా కొనసాగుతున్నారు. బుధవారం రోజున లోక్సభలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చట్టసవరణ బిల్లుపై చర్చలో పాల్గొన్నారు ప్రగ్యా ఠాకూర్ . ఆ సమయంలో మహాత్మాగాంధీని గాడ్సే ఎలా చంపారో అనే విషయాన్ని డీఎంకే సభ్యులు రాజా చెప్పారు. వెంటనే రాజా ప్రసంగాన్ని అడ్డుకున్న ప్రగ్యా ఠాకూర్.. గాంధీని హత్యచేసిన గాడ్సే నిజమైన దేశభక్తుడంటూ అభివర్ణించారు.
ప్రగ్యా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. జాతిపిత గాంధీని హత్య చేసిన వ్యక్తి గాడ్సే దేశభక్తుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. ప్రగ్యాసింగ్ సభకు వెంటనే క్షమాపణ చెప్పాలని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. ఇక సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా కలగజేసుకుని రాజా వ్యాఖ్యలు మాత్రమే రికార్డులోకి వెళతాయని.. ప్రగ్యా ఠాకూర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడంతో సభ శాంతించింది. ఇక లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ప్రచారం సందర్భంగా గాడ్సేని దేశభక్తుడిగా అభివర్ణించారు ప్రగ్యా ఠాకూర్. ఆమె చేసిన వ్యాఖ్యల మరుసటి రోజే ప్రధాని మోడీ ఖండించారు. మహాత్మాగాంధీని అవమానించిన ప్రగ్యా ఠాకూర్ను ఎన్నటికీ క్షమించలేమని మోడీ చెప్పారు.