'అలాంటి కూతుళ్ల కాళ్లు విరగ్గొట్టండి'.. ప్రగ్యా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు
తల్లిదండ్రులు చెప్పినట్లుగా నడుచుకోని కూతుళ్ల కాళ్లు విరగ్గొట్టండని మధ్యప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాన్- హిందూ కుటుంబాల్లోకి తమ కూతుళ్లు వెళ్లకుండా చూడాలని అన్నారు. ఒకవేళ వాళ్లు ఒప్పుకోకపోతే వాళ్ల కాళ్లు విరగ్గొట్టాలంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భోపాల్ లోని ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విధంగా వ్యాఖ్యానించారు.
" మీ హృదయాన్ని గట్టి చేసుకోండి. దృఢంగా మార్చుకోండి. మన కూతుళ్లు మన మాటలు వినకుంటే వాళ్లు నాన్- హిందూ ఇళ్లలో అడుగుపెడితే ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ల కాళ్లు విరగ్గొట్టండి. ఎవరైతే మన నమ్మకాలు, విశ్వాసాలను అలాగే తల్లిదండ్రుల మాటలను పట్టించుకోరో వారిని శిక్షించాల్సిందే. వాళ్ల మంచి కోసం వాళ్లను కొట్టడానికి ఏమాత్రం ఆలోచించొద్దు. తల్లిదండ్రులు ఇలా చేస్తేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది" అని మాజీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
" అమ్మాయిలు ఎవరైతే తల్లిదండ్రుల మాట వినరో.. వాళ్లు తల్లిదండ్రులను గౌరవించనట్టే లెక్క. వాళ్లు తల్లిదండ్రులను గౌరవించరు. అలాగే అలాంటి కూతుళ్లు ఇంట్లో నుంచి పారిపోతారు. వారిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి. వాళ్లను ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయోద్దు. అలాంటి వాళ్లను కొట్టి లేదా తిట్టి అర్థం అయ్యేటట్లు చెప్పాలి" అని ప్రగ్యా సింగ్ ఠాకూర్ మతపరమైన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుబట్టింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా మాట్లాడుతూ.. సమాజంలో ఇలాంటి విద్వేషపూరితమైన మాటలను ఎందుకు మాట్లాడుతున్నారని.. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో కేవలం 7 మాత్రమే జరిగాయని.. ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ప్రగ్యా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

ఇక మధ్య ప్రదేశ్ కు చెందిన ప్రగ్యా సింగ్ ఠాకూర్.. 2019లో బీజేపీలో చేరారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో భోపాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తొలిసారి లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అయితే ప్రగ్యా సింగ్ ఠాకూర్ కు 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భోపాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ నిరాకరించింది.












Click it and Unblock the Notifications