గడ్కరీ ని ప్రశంసిస్తూ.. మోదీ, అమిత్ షా ని విమర్శిస్తున్న చంద్రబాబు..! అసలు వ్యూహం ఏంటి..?
హైదరాబాద్ : పటిష్టమైన పాలనా వ్యవస్థను కకావికలం చేయాలంటే మొదట శత్రు దుర్బేద్యం లాంటి కోటలోకి ప్రవేశించాలి. తర్వాత కోటలోని తటస్థ వ్యక్తులను సంప్రదించి రాజుగారి బలహీనతలను తెలుసుకోవాలి. ఆ తర్వాత రాజుగారి కొలువులోని అసంత్రుప్తులను గుర్తించి వారి సహకారం తీసుకుని, అదునుచూసి మెరుపుదాడి చేయాలి. ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారం చేస్తే తప్ప ఫలితం కనబడదు. ప్రస్తుతం కేంద్ర బీజేపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏపి సీయం చంద్రబాబు నాయుడు అవలంభిస్తున్న వ్యూహం ఇలాంటిదనే తెలుస్తోంది. ప్రధాని మోదీ కి అత్యంత సన్నిహితుడైనప్పటికి ఆయన పై అప్పుడప్పుడు వ్యతిరేక గళం వినిపించే నితిన్ గడ్గరీని ప్రశంసల్లో ముంచుతూ మోదీ కోటరీని విమర్శించడం వెనక ఆంతర్యం ఏంటి..?
కేంద్రం పై చంద్రబాబు గడ్కరీ అస్త్రం..! ఫలితం ఇస్తుందా..?
2014 సునాయాసంగా అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ, వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం అంత తేలికైన పనిగా కనిపించడం లేదు. అప్పుడు మోదీకి ఉన్న క్రేజ్కు తోడు కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఎన్డీయేను అధికారంలోకి తీసుకువచ్చాయి. కానీ, ఈ సారి పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న వ్యతిరేకతే. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పలు సంస్కరణలు, తీసుకున్న నిర్ణయాలు ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేక పోవడం దీనికి కారణంగా తెలుస్తోంది.
మసకబారుతున్న ఎన్డీయే చరష్మా..! ఫలితాలివ్వని మోదీ పథకాలు..!!
ముఖ్యంగా ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి కొన్ని సంస్కరణలకు ప్రజల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. వీటికి తోడు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కూడా భారీ స్థాయిలో ఉండడంతో కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో కొందరు వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు కష్టాలు తప్పవనే అభిప్రాయానికి వచ్చేశారు. దీనికి తోడు, బీజేపీయేతర పార్టీలు బలపడుతుండడం, అవన్నీ కలిసి కూటమిని ఏర్పాటు చేస్తుండడం కూడా ఎన్డీయేను కలవరపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీయేతర కూటమికై పావులు కదుపుతున్న ఏపీ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఎవరూ ఊహించని అస్త్రాన్ని సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
ఏపి కి కేంద్రం అన్యాయం చేసింది..! మూల్యం చెల్లించక తప్పదంటున్న బాబు..!!
తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. దీంతో చంద్రబాబు, రాహుల్ మద్య స్నేహం చిగురించింది. అంతే కాకుండా బీజేపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తరచూ చర్చలు జరుపుతున్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్న దానిపై కాకుండా, బీజేపీని ఎలా ఓడించాలన్న దానిపై దృష్టి సారిస్తే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో కమలం పార్టీని దెబ్బ కొట్టేందుకు వీళ్లిద్దరూ కలిసి ‘ఆపరేషన్ గడ్కరీ' ప్రణాళికను సిద్దం చేసినట్టు తెలుస్తోంది.
గడ్కరీ కున్న రాజకీయ పరిపక్వత మోదీకి లేదు..! చంద్రబాబు ఘాటు విమర్శలు..!!
మోదీ, అమిత్షా నాయకత్వంపై తరచూ పరోక్ష విమర్శలు చేస్తుంటారు కేంద్ర మంత్రి గడ్కరీ. ఈయన చంద్రబాబు పట్ల సానుకూల వైఖరితో ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీనినే వాడుకుని మోదీ కోటరీని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు చంద్రబాబు, రాహుల్. ఇందులో భాగంగానే గడ్కరీని హైలైట్ చేయడం, అదే సమయంలో మోదీ, అమిత్ షా ల ప్రమేయాన్ని తగ్గించాలని పథకం రచించారు. బీజేపీలోని సీనియర్లు సైతం ఈ సారి ప్రధాని అభ్యర్థిగా గడ్కరీని ప్రకటించాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వీళ్లు వీళ్లు సంధిస్తున్న అస్త్రం లక్ష్యాన్ని ఛేదిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి అన్నీ కలిసొస్తే చంద్రబాబు వ్యూహానికి రాహుల్ సహకారం ఉంటే కేంద్రంలో ఊహించని మార్పులు సంభవించొచ్చని చర్చ జరుగుతోంది.