టీవీ చానెళ్ల బ్యాన్పై కెసిఆర్కు ప్రకాష్ జవదేకర్ లేఖ
న్యూఢిల్లీ: తెలంగాణ వ్యాప్తంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితోపాటు టీవీ9 చానల్ ప్రసారాలను కేబుల్ ఆపరేటర్లు నిలిపివేయడంపై జోక్యం చేసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును కోరారు. మంగళవారం దీనిపై ఓ లేఖ రాశారు.
కేబుల్ ఆపరేటర్లు ఈ చానళ్లను అక్రమంగా నిలిపివేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రసారాలు పునరుద్ధరించేలా చూడాలని జవదేకర్ ఆ లేఖలో అన్నారు. ఇదిలావుంటే, తెలంగాణలో తమ చానల్ ప్రసారాలను పునరుద్ధరించాలని కోరుతూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ డీహెచ్వీఎస్ఎస్ఎన్ మూర్తి హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం దీనిపై పిటిషన్ దాఖలు చేశారు.
కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ (రెగ్యులేషన్) చట్టం 1995లోని నిబంధనలకు వ్యతిరేకంగా జూన్ 15 నుంచి తమ చానల్ ప్రసారాలను ఏకపక్షంగా నిలిపివేశారని తెలిపారు. తమ చానల్లో తెలంగాణ శాసన సభ్యులను అవహేళన చేసేలా ఎటువంటి కార్యక్రమాలు ప్రసారం చేయలేదన్నారు.
ఒకవేళ ఏదైనా చానల్లో అభ్యంతరకర కార్యక్రమాలు ప్రసారాలు చేస్తే ప్రజాహితం దృష్ట్యా ఆ కార్యక్రమాన్ని నిలిపివేసే అధికారం చట్టంలోని సెక్షన్ 19కింద అధీకృత అధికారులకు మాత్రమే ఉంటాయని, కానీ, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండా తెరవెనుక నుంచి ఎంఎస్వోల ద్వారా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు.
చట్టపరంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తెంగాణాలో ఏకపక్షంగా చానల్ ప్రసారాలను నిలిపి వేసిన ఎంఎస్వోలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలకు ఎటువంటి అంతరాయం కల్పించరాదని ఆదేశించాలని పిటిషన్లో హైకోర్టును కోరారు.
పిటిషన్లో కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖను, తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ముఖకార్యదర్శిని, పది జిల్లాల కలెక్టర్లను, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ను, తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ఓల సంఘాన్ని, వ్యక్తిగత హోదాలో ఆ సంస్థ అధ్యక్షుడు ఎం. సుభాష్రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు.