రాష్ట్రపతి పాలన విధింపు: రసవత్తర 'మహా' రాజకీయ
కాంగ్రెస్, పార్టీ ఎన్సీపీ మధ్య సయోధ్య కుదరకపోవడతో పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల కోసం కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య పొత్తు కుదరలేదు. దీంతో ఎన్సీపీ ప్రభుత్వం నుండి తప్పుకుంది. కాంగ్రెసు పార్టీ మైనార్టీలో పడటంతో రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. కేంద్ర కేబినెట్ సిఫార్సు కూడా సిఫార్స్ చేసింది.
కాగా, గుజరాతీల పెత్తనానికి దాసోహమనకూడదని శివసేన, తమ పూర్వీకుల మాదిరి శివసేనను బుజ్జగించి భుజాలకెత్తుకునే సంస్కృతికి స్వస్తి చెప్పాలని భారతీయ జనతా పార్టీ తీసుకున్న కీలక నిర్ణయం మహారాష్ట్ర విధానసభ ఎన్నికలలో అనూహ్య పరిణామాలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కేంద్రంలో మాదిరి మహారాష్ట్రలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలకు తెరపడి ఏకపార్టీ పాలన వస్తుందా? లేక త్రిశంకు సభకు దారితీసి ఇప్పటికంటే అధ్వాన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటాయా? అన్న విషయంపై ఉత్కంఠత నెలకొంది. మహారాష్ట్రలో ఇప్పటిదాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వంపై ఉన్న విపరీతమైన ప్రజావ్యతిరేకతను లోక్సభ ఎన్నికల ఫలితాలు రుజువుచేశాయి. మరోవైపు శివసేన కంటే బిజెపికే ఎక్కువ సీట్లు దక్కాయి.
దీంతో పట్టణ ప్రాంతాలలోనేగాక గ్రామీణ ప్రాంతాల్లోనూ తమ పార్టీకి మంచి ఆదరణ లభించటంతో విధానసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని బిజెపి పసిగట్టింది. ఈ దిశలో వ్యూహాత్మకంగా పావులు కదిపిన బిజెపి.. ఒక పక్క పొత్తుపై ఆసక్తికనపరుస్తూనే మరోవైపు ఒంటరి పోరాటానికి ఉన్న అవకాశాలపై దృష్టి సారించింది.
రాజకీయ వ్యూహంలో ఆరితేరిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అనుచర గణంతో నాలుగు సర్వేలు చేయించి ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అభ్యర్థులను కూడా ఎంపిక చేసుకున్నారు. శివసేనతో పొత్తు లేకుండా ఒంటిరిగా పోటీచేసిన పక్షంలో 140 స్థానాలలో విజయం ఖాయమని సర్వేలు నిర్ధారించటంతో ఒంటరి పోరాటంపై ప్రధాని నరేంద్ర మోడీతో అమిత్ షా చర్చించారు. ఆ తరువాత శివసేనతో తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.
బాల్ థాకరే మరణానంతరం శివసేన పగ్గాలు చేపట్టిన ఉద్ధవ్ థాకరేతోనూ ప్రస్తుతం మోడీ అంతగా స్నేహభావంతో ఉండలేకపోతున్నారు. ఇదిలావుంటే మోడీ, అమిత్ షాల నేతృత్వంలో తమ ప్రాధాన్యత తగ్గుతోందని పసిగట్టిన ఉద్ధవ్ థాకరే కూడా ప్రత్యామ్నాయ వ్యూహంపై దృష్టి పెట్టారు. మహారాష్ట్ర ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మొత్తానికి శివసేనతోపాటు ఎన్సీపీ నుంచి బిజెపికి తీవ్రమైన పోటీ ఎదురయ్యే అవకాశాలున్నందున మహారాష్ట్ర ఎన్నికల దృశ్యం ఆసక్తిగా మారటం ఖాయమని చెప్పక తప్పదు.