జగన్ రాజకీయ వ్యూహకర్తకు సలాం కొట్టాల్సిందే: బెంగాల్లో బీజేపీ ముఖచిత్రమేంటో:
కోల్కత: దేశవ్యాప్తంగా ప్రజలు ఎప్పుడెప్పుడా అంటూ ఉత్కంఠతగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారాన్ని అందుకునేదెవరు? ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యేదెవరో స్పష్టమౌతోంది. భారతీయ జనతా పార్టీ అస్సాంలో అధికారాన్ని నిలుపుకోవడం ఖాయమైంది. కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక మిగిలిన మూడు అతిపెద్ద రాష్ట్రాల్లో మాత్రం బీజేపీకి ఎదురు దెబ్బలు తప్పట్లేదు.

తమిళనాడులో అధికారానికి దూరం
తమిళనాడులో అధికారాన్ని కోల్పోబోతోన్నారు కమలనాథులు. అధికార ఏఐఎడీఎంకేతో కుదుర్చుకున్న పొత్తు పూర్తిగా బెడిసి కొట్టింది. బీజేపీని నమ్ముకున్న అన్నాడీఎంకే నిండా మునిగినట్టవుతోంది. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రావడం దాదాపు ఖాయమే. కేరళలో బీజేపీ ఒకట్రెండు స్థానాలకే పరిమితం కావచ్చు. మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. ఏ మాత్రం ఉపయోగం కనిపించట్లేదు. శ్రీధరన్, సురేష్ గోపీ, కుమ్మనం రాజశేఖరన్ మినహా మరెవరూ బీజేపీ అభ్యర్థులెవరూ పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతున్నారు.

అన్నింటికీ మించి
అన్నింటికీ మించి- అధికారంలోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేసిన పశ్చిమ బెంగాల్లో ఎదురవుతోన్న ఫలితాలు కమలనాథులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోన్నారు. ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాల కంటే కూడా తక్కువ స్థానాలే నమోదవుతున్నాయి. మూడంకెలను అందుకోవడం కాదుకదా.. దాని దరిదాపులకూ కూడా చేరలేకపోతోంది బీజేపీ. ఎన్నికలకు కొన్ని నెలల ముందే పశ్చిమబెంగాల్లో మకాం వేసి, తృణమూల్ కాంగ్రెస్కు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆకర్షించి.. వారితోనే నామినేషన్లు వేయించిన వ్యూహం ఏదైతే ఉందో.. అసలుకే ఎసరు తెచ్చిపెట్టినట్టయింది.

ప్రశాంత్ కిషోర్ జోస్యం..
పశ్చిమ బెంగాల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోందనేది ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ముందుగానే పసిగట్టారు. ఎంత గింజుకున్నా రెండంకెలను దాటబోదని తేల్చి చెప్పారు. బీజేపీ గనక మూడంకెల అసెంబ్లీ స్థానాలను అందుకుంటే.. తాను రాజకీయ సర్వేల నుంచి స్వచ్ఛందంగా వైదొలగిపోతానని సవాల్ విసిరారు. అదే సవాల్కు కట్టుబడీ ఉన్నారాయన. తాజాగా వెలువడుతోన్న ఫలితాలు- ప్రశాంత్ కిషోర్ అంచనాలకు అనుగుణంగా వెలువడుతున్నాయి. మూడంకెలకు అతి దూరంగా ఆగిపోయేలా కనిపిస్తోంది బీజేపీ సాధించిన సీట్ల సంఖ్య.

తృణమూల్ హవా..
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ హవా బలంగా వీస్తోంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలకు గాను తృణమూల్ 203 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. బీజేపీ 84 స్థానాల్లో లీడింగ్లో ఉంది. పశ్చిమ బెంగాల్ను సుదీర్ఘకాలం పాటు పాలించిన కమ్యూనిస్టులు రెండు చోట్ల, ఇతరు మూడు సీట్లల్లో ఆధిక్యంలో ఉంటున్నారు. నందిగ్రామ్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్వల్పంగా వెనుకంజలో ఉండటం ఆ పార్టీ నేతలను నిరాశకు గురి చేస్తోంది. ఈ స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసిన సువేందు అధికారి ఆధిక్యతలను కనపరుస్తున్నారు.












Click it and Unblock the Notifications